Friday, May 3, 2024

ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్.. వంట మాస్టర్ యాదమ్మకు అవమానం

- Advertisement -
- Advertisement -

Cook Yadamma get insulted at Novotel

ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా పిలుపు
వంట మాస్టర్ యాదమ్మకు అవమానం
నోవాటెల్‌లోకి ‘నో ఎంట్రీ’
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నోవాటెల్‌లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ వంట మాస్టర్ యాదమ్మకు అవమానం జరిగింది. వంట చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన ఆమెను ప్రధానికి తెలంగాణ రుచులు చూపించేందుకు యాదమ్మను పిలిపించారు. ఈ క్రమంలతో పాస్ లేదంటూ నోవాటెల్‌లోకి వెళ్లకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో యాదమ్మ తన అనుచరులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి జాతీయ నాయకులు హైదరాబాద్‌కు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అతిథులకు తెలంగాణ రుచులను వడ్డించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాకు చెందిన పాకశాస్త్ర నిపుణురాలు యాదమ్మను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలిపించారు. గత 29 సంవత్సరాలుగా వంటలు చేయడంలో మంచి ప్రావీణాన్ని సంపాదించిన యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం, గౌరవెల్లి. 15 ఏళ్లకే పెళ్లి కావడంతో అత్తారిల్లు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు వచ్చేసి అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు చేయడం నేర్చుకుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలు చేయడంలో యాదమ్మ స్పెషలిస్ట్. కరీంనగర్ జిల్లా, ఆ చుట్టుపక్కల ఎంతో పేరు తెచ్చుకున్న యాదమ్మ.. ఇప్పుడు విఐపి చెఫ్‌గా మారిపోయారు.

టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నేతల ఇళ్లల్లో జరిగే పలు వేడుకలకు యాదమ్మ వంటలు చేసేవారు. అలా ఆమె పేరు రాజకీయ వర్గాల్లోనూ మారుమోగింది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సామూహిక కార్యక్రమాలకు యాదమ్మ చేతి వంటలనే రుచి చూపిస్తారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో పర్వదినాల సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక భోజన కార్యక్రమానికి కూడా యాదమ్మ వంటలు చేస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అతిథులకు ఆమె చేతి వంట రుచిని చూపించనున్నారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ఆమెను హైదరాబాద్‌కు రప్పించుకున్నారు. కొన్ని వంటకాలను చేయించుకున్న బండి సంజయ్ కుమార్ సూచనలు ఇచ్చారు. ఏకంగా దేశ ప్రధానికి తన చేతులతో చేసిన వంటకాలను రుచి చూపించనుండటంతో యాదమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల సందర్భంగా పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ కూ, సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటి వంటకాలను చేస్తామని యాదమ్మ ఆ సందర్భంగా తెలిపారు.

Cook Yadamma get insulted at Novotel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News