కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలోని ఓ నిర్మాణసంస్థలో పని చేస్తున్న 66 మంది భారతీయులకు కరోనా సోకినట్లు శ్రీలంక ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం తెలియజేశారు. ఉత్తర కొలంబోలో ఉంటున్న వీరందరినీ ఫిష్ మార్కెట్ క్లస్టర్ ద్వారా కరోనా పాజిటివ్ సోకిన ఫస్ట్ లెవల్ కాంటాక్ట్లుగా గుర్తించినట్లు కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రువాన్ విజెముని పిటిఐకి తెలిపారు. వీరందరికీ రాండమ్ టెస్టులు నిర్వహించగా మొదటి బ్యాచ్లో 19 మందికి, తర్వాతి బ్యాచ్లో 47 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని ఆయన చెప్పారు.
వీరందరికీ ధర్గా టౌన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక చికిత్సా కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొలంబోలని ఫిష్ మార్కెట్ క్లస్టర్ దేశంలోనే అతి పెద్ద కరోనా వ్యాప్తి కేంద్రంగా మారిందని కొవిడ్ నిరోధక జాతీయ కార్యకలాపాల కేంద్రం తెలిపింది. శుక్రవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 15,722 కరోనా కేసులు నమోదు కాగా, ఈ ఫిష్ మార్కెట్ క్లస్టర్లోనే మొత్తం 9,120 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. శ్రీలంకలో ఇప్పటివరకు కరోనా కారణంగా 48 మంది చనిపోయారు. శ్రీలంకలో అక్టోబర్లో కరోనా రెండోవేవ్ ప్రారంభమయ్యే సమయానికి కేవలం 3,396 పాజిటివ్ కేసులు, 13 మరణాలు మాత్రమే ఉండగా, అప్పటినుంచి ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.