Monday, April 29, 2024

తీవ్రరూపం దాల్చిన మిచాంగ్ తుపాన్

- Advertisement -
- Advertisement -

దక్షిణాది రాష్ట్రాలకు హై అలర్ట్
ఈ నెల 5న ఏపిలో తీరం దాటే అవకాశం
భారత వాతావరణ శాఖ వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణాది రాష్ట్రాలకు వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో తమిళనాడుకు కూడా ముప్పు పొంచి ఉంది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఒడిశాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాగల మూడు రోజులు కీలకమని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. శనివారం ఉదయం నుంచి మత్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంత బాధితుల కోసం అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు:
కింది స్థాయిలో గాలులు తూర్పు ఆగ్నేయ దిశనుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది . ఆది సోమ వారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News