Friday, May 3, 2024

వడివడిగా దళితబంధు

- Advertisement -
- Advertisement -

Dalit bandhu Implemented in all constituencies in Telangana

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు

తొలిదశలో ఎంఎల్‌ఎల సలహాలతో 100మంది చొప్పున
లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెల 5లోగా ప్రక్రియ పూర్తి
మార్చి 7లోగా లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ల కేటాయింపు
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొప్పుల, సిఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు

మనతెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ బిఆర్‌కెఆర్ భవన్ నుంచి సిఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం. కార్యాలయం కార్యదర్శి, ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్‌సి కార్పొరేషన్ ఎండి కరుణాకర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ సిఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకం సత్ఫలితాలతో దళితులు అభివృద్ధిబాటలో పయనిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు పథకం అమలు చేస్తామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు పెట్టుకొని ఫిబ్రవరి 5లోగా అర్హులైన లబ్ధిదారుల జాబితా – సిద్ధం చేసి అందించాలని సూచించారు. మార్చి నెల 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఇందులో నుంచి రూ.10వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దళిత బంధు అమలుపై పలు ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి నెలలో యూనిట్లను లబ్ధిదారులకు అందజేయడంతో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

శాసనసభ్యుల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను రూపొందించనున్నామని సిఎస్ తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ. 1200 కోట్ల కేటాయించాం. ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశాం. విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వాసాలమర్రి, హుజురాబాద్‌లో దళిత బంధు పథకం అమలులో ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో అమలు చేస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News