సిఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలకు చిరునామాగా మారారని బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్,కెటిఆర్,హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీలపై నరనరాన విషం నింపుకుని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీని నొప్పియ్యొద్దు,చంద్రబాబును మెప్పియ్యాలి అనే ధోరణితో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మిడతలా ఎగిసి పడుతున్నారని, ఆయన తెలంగాణకు శాపంలా మారారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ నేతలు జి.దేవి ప్రసాద్,చిరుమళ్ల రాకేష్ కుమార్,రాంచంద్ర నాయక్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల గురించి రేవంత్ రెడ్డికి పట్టదా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ హయాంలో తెలంగాణలోని 86 శాతం సాగు యోగ్యమైన భూమిగా మారిందని, రేవంత్ హయాంలో 2 శాతం తగ్గిందని అన్నారు. కెసిఆర్ గోదావరి జలాలను వాడుకుని తెలంగాణను సస్యశ్యామలం చేశాక రాయలసీమకు నీళ్లివ్వాలి అన్నారని, ఇందులో తప్పు ఏమి ఉందని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్లో కెసిఆర్ చేసిన వాదనలు రేవంత్ రెడ్డి
తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎజెండా నెంబర్ 5ను ఉద్దేశపూర్వకంగా రేవంత్ విస్మరించి ఎజెండా 1 గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అనుమతి లేకుండా ఎపిలో గోదావరి ప్రాజెక్టులకి అంగీకరించమని కెసిఆర్ స్పష్టం చేశారని తెలిపారు. 2020లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్కు రాసిన లేఖలో సముద్రంలో కలుస్తున్న 3 వేల టిఎంసిల్లో 1950 టిఎంసిలు తెలంగాణకు కేటాయించాలని కెసిఆర్ కోరారని గుర్తు చేశారు. గోదావరిలో హక్కుగా ఉన్న 968 టిఎంసిలకు తోడు 1950 టిఎంసిలు కావాలని అంటే దాదాపు 3 వేల టిఎంసిలు కావాలని కోరారని తెలిపారు. వెయ్యి టిఎంసిలు చాలు అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా..? అని నిలదీశారు. నీ తాత జాగీరా రేవంత్ రెడ్డి వెయ్యి టిఎంసిలు చాలు అనడానికి అంటూ సిఎంను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై దమ్ముంటే హరీష్ రావుతో చర్చకు రావాలని సిఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. హరీష్ రావు ఒక్కరే చర్చకు వస్తారని, రేవంత్ రెడ్డి ఎంతమందినైనా చర్చకు తీసుకురావొచ్చని అన్నారు. ఎవరికెంత జ్ఞానం ఉందో తేల్చేద్దామని పేర్కొన్నారు. ఏ విషయం తెలియని రేవంత్ రెడ్డి ఇకనైనా తెలుసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.