టి20 ప్రపంచకప్లో‘ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ గా సత్తా చాటిన వార్నర్
విమర్శకుల నోళ్లు మూయించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్
సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే మరింత ముందుకు దూసుకు వస్తుందని దానర్థం. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అలాంటి వాడేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడేళ్ల పాటు వరసగా ఐపిఎల్లో పరుగుల వరద పారించిన అతడు ఒక్క సీజన్లో విఫలమయ్యేసరికి అతడి పనయిపోయిందనే విమర్శలను ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపిఎల్ ట్రోఫీని అందించిన తనని కెప్టెన్సీ బాధ్యతలనుంచి తొలగించడం మరింత అవమానకరంగా మారింది. ఈ క్రమంలోనే టి20 ప్రపంచకప్లో అడుగుపెట్టి నెల రోజులు తిరక్క ముందే తానేమిటో నిరూపించుకున్నాడు. ‘ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఆస్ట్రేలియా తొలి సారి టి20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
పరుగుల వరద
ఐపిఎల్లో వార్నర్ తిరుగులేని బ్యాట్స్మన్ అనే విషయం అందరికీ తెలిసిందే. 2014లో సన్రైజర్స్ జట్టులో చేరిన అతను అప్పటినుంచి గతేడాది వరకు వరసగా ఏడేళ్లు 500 పైచిలుకు పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకుని తనకు మరెవరూ సాటి రారని చాటి చెప్పాడు. 2014సీజన్లో తొలిసారి 528 పరుగులు చేసిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. 2015లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా నియమితుడై 562 పరుగులు సాధించి ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇక 2016లోనైతే 848 పరుగులతో మరింత రెచ్చిపోయి ఏకంగా సన్రైజర్స్కు ఐపిఎల్ ట్రోఫీనే అందించాడు. అప్పుడు రాయల్ చాలెంజ్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆపై వరసగా 641, 692,548 పరుగులు చేసి జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు. అయితే నిలకడగా బ్యాటింగ్ల్లో రాణిస్తూ సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్తున్న వార్నర్ ఈ సీజన్లో మాత్రం తేలిపోయాడు. అటు సారథిగా, ఇటు బ్యాట్స్మన్గా ఘోరంగా విఫలమయ్యాడు.
భారత్లో జరిగిన టోర్నమెంట్ అర్ధభాగంలో కాస్త పరవాలేదనిపించినా యుఎఇలో ఆడిన తొలి రెండు మ్యాచ్లలోను పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తం 8 మ్యాచ్లలో రెండు అర్ధ శతకాలతో 195 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఈ సారి జట్టు కూడా మొత్తంగా చేతులెత్తేసింది. ఆడిన 14 మ్యాచ్లలో కేవలం మూడే గెలిచి అత్యంత దారుణమైన ప్రదర్శన ఇచ్చింది. దీంతో సన్రైజర్స్ యాజమాన్యం వార్నర్ను పక్కన పెట్టింది. లీగ్ దశలో కెప్టెన్సీ బాధ్యతలనుంచి కూడా తప్పించింది. కేన్ విలియమ్సన్కు ఆ బాధ్యతలు అప్పగించింది. తుది జట్టులో అవకాశమే ఇవ్వకుండా దారుణంగా అవమానించింది. అయినా వార్నర్ అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. తనను తుది జట్టులోంచి తొలగించినా డగౌట్లో కూర్చుని జట్టు విజయాలకోసం మద్దతు ఇచ్చాడు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సన్రైజర్స్ తరఫున తనకు ఇదే చివరి సీజన్ అనే సంకేతాలను కూడా ఇచ్చాడు.
ఇక ఐపిఎల్ ముగిసిన సరిగ్గా నెలరోజులు తిరక్క ముందే ఐసిసి 2021 టి 20 ప్రపంచకప్లో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ ఏకంగా ‘ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఆడిన 7 మ్యాచ్లలో 289 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో వార్నర్ మూడు అర్ధ శతకాలు సాధించగా, మరో వైపు సెమీఫైనల్లో పాక్పై 49, ఫైనల్లో న్యూజిలాండ్పై 53 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆ జట్టు తొలి సారి టి20 క్రికెట్లో చాంపియన్గా నిలిచింది. ఈ ప్రదర్శనతో వార్నర్ తనను విమర్శించిన వారికి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చాడు. వార్నర్ సతీమణి కాండీస్ సైతం ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. తనభర్తను అభినందిస్తూనే.. ఫామ్ కోల్పోయాడని, వయసు పైబడిందని,ఆటలో వేగం తగ్గిందని విమర్శించిన వారందరినీ ఎద్దేవా చేసింది. ఏదేమైనా వార్నర్ నిజంగానే కీలక సమయంలో రాణించి తన జట్టును గెలిపించడమే కాకుండా తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి వచ్చే ఐపిఎల్ సీజన్లో వార్నర్ను ఏ జట్టు తీసుకుంటుందో వేచి చూడాలి.