డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ మద్దతుదారులకే
కెటిఆర్ సీల్డ్కవర్ వ్యూహంతో అన్ని చోట్లా ఏకగ్రీవాలు
5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), జిల్లా సహకార మార్కెటిం గ్ సోసైటీ ఛైర్మన్(డిసిఎంఎస్), వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో టిఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించింది. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పక్కా రాజకీయవ్యూహంతో వ్యవహరించి విపక్షాలకు చెమటలు పోయించారు. చివరినిమిషం వరకు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి డైరెక్టర్లను సమన్వయ పరిచి టిఆర్ఎస్ ఎ న్నికల పరిశీలకులతో అభ్యర్థులపేర్లను ప్రకటింపచేశారు. టిఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలమేరకు జిల్లాలవారీ గా డైరెక్టర్లు డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లను, వై స్ చైర్మన్లను ఎన్నుకోవడంతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. శనివారం ఉద యం ఎనిమిది గంటలకు ఎన్నికల ప్ర క్రియ ప్రారంభంకాగానే జిల్లామంత్రు లు, శాసనసభ్యులు, డైరెక్టర్ల సమక్షం లో టిఆర్ఎస్ అధిష్ఠ్టానం పంపించిన సీల్డ్ కవర్ను ఎన్నికల పరిశీలకు లు తెరిచి పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆశావాహులు అధిష్ఠానం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సి వచ్చిం ది. సీల్డ్ కవర్లో పేర్లను ప్రకటించిన అ నంతరం పరిశీలకులు డైరెక్టర్లను ఉద్ధేశించి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పంపించిన సందేశాన్ని వినిపించారు. సామాజిక సమీకరణలు, ఇతర నివేదికల ఆధారంగా పార్టీ అనేక పరిశీలనలు చేసిన అనంతరం అభ్యర్థులను ఖరారు చేసింది. అర్హులైన ఆశావాహులను భవిష్యత్లో పార్టీ గుర్తించి తగిన అవకాశాలు కల్పిస్తుందని కెటిఆర్ సందేశాన్ని వివరించి ఏకగ్రీవాలకోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. డిసిసిబి ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, డిసిఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు జిల్లాలవారిగా డైరెక్టర్లు బలపర్చారు. జిల్లామంత్రులు ఎన్నికల పరిశీలకులను సమన్వయపరిచి ఎన్నికలు నిర్వహించారు.
ఫలించిన కెటిఆర్ వ్యూహం
డిసిసిబి ఛైర్మన్ పదవులకోసం అధికార టిఆర్ఎస్ పార్టీలో పోటీ అధికమవడంతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయ ఎత్తుగడలతో చివరి నిమిషంవరకు అభ్యర్థులపేర్లను ప్రకటించలేదు. జిల్లాల వారీగా మంత్రులు తాము బలపర్చే అభ్యర్థులకే డిసిసిబి పీఠం దక్కాలని పట్టుబట్టడంతో పాటు జిల్లానాయకులు తాము బలపర్చిన అభ్యర్థులకు సీటు దక్కాలని టిఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ప్రధానంగా నల్గొండ, ఆదిలాబాద్, నిజమాబాద్, వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్లో ఆశావాహుల జాబితా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎవరినీ నొప్పించకుండా అనేక నివేదికలను టిఆర్ఎస్ అధినేత,రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి పరిశీలించి సీల్డ్కవర్లో పరిశీలకులకు పేర్లజాబితాను ఇచ్చిపంపారు. అధిష్ఠానం సీల్డ్కవర్ పంపింపచడంతో ఆశావాహులు పార్టీ క్రమశిక్షణకు తప్పనిసరిగా కట్టిబడాల్సి వచ్చింది. ఎన్నికలు ఏవైనా కెటిఆర్ పక్కారాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లి టిఆర్ఎస్కు విజయం సమకూరుస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి డిసిసిబి ఎన్నికల్లో టిఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించడంతో కెటిఆర్ రాజకీయ వ్యూహం మరోసారి ఫలించింది.
దరిదాపుల్లో లేని విపక్షాలు
జిల్లాలవారీగా డిసిసిబి డైరెక్టర్లతో టిఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు సమావేశాలు ఏర్పాటుచేసి ఏకాభిప్రాయం సాధించిన అనంతరం సీల్డ్ కవర్లోని పేర్లను ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో ఎన్నికల పరిశీలకుడు పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవం సాధించారు. డిసిసిబి ఎన్నికల్లో విపక్షాల డైరెక్టర్లు లేకపోవడంతో టిఆర్ఎస్ దరిదాపుల్లోకి విపక్షాలు రాలేక పోయాయి. అలాగే అధికంగా ఆశావాహులు ఉన్న నిజమాబాద్జిల్లా, నల్గొండ, వరంగల్ జిల్లాలో మంత్రులు ఎన్నికల పరిశీలకులతో కలిసి సమన్వయం సాధించడంతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.
ఈ నెల 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మెన్ను ఈ నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను రెండో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డిసిసిబి), జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ(డిసిఎంఎస్)లకు శనివారం జరిగిన చైర్మెన్, వైస్ చైర్మెన్లను ఓటర్లుగా ఉన్న డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసిసిబి చైర్మెన్లు టెస్కాబ్లో బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఉండనున్నారు. ఈ నెల 5న టెస్కాబ్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ను వీరు ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు.
అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) చైర్మెన్, డిసిసిబి డైరెక్టర్లు, చైర్మెన్ల ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవమై అధికార టిఆర్ఎస్ పార్టీ మద్ధతుదారులు గెలుచుకున్న విషయం తెలిసిందే. టెస్కాబ్ చైర్మెన్ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. రేసులో ప్రస్తుత చైర్మెన్ కొండూరు రవీందర్రావుతో పాటు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. రిజర్వుడు స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డిసిసిబిల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది, ఇక అన్ని డిసిఎంఎస్లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికైన విషయం విదితమే.