Monday, April 29, 2024

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • 21 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయండి
  • ప్రతి కార్యక్రమంలో ప్రజలను భారీగా భాగస్వామ్యం చేయాలి
  • తొమ్మిదేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేప్పండి
  • ప్రతి రంగంలో నాటి, నేటి ప్రగతిని ప్రజలకు కర్రపత్రాలతో వివరించండి
  • పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలి
  • దశాబ్ది ఉత్సవాల సమీక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఘనమైన చరిత్ర ఉన్న ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో ఘనం గా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను అదేశించారు. మంగళవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉంద ని, పరిపాలన అద్భుతంగా సాగుతుందని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైనదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు సకలజనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్షను రగిల్చారని, సాధించిన తెలంగాణలో అభివృద్ధి కి అదే ఆకాంక్షతో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని అధికారులు, ఉద్యోగులు పూర్తి స్దాయిలో భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నపెగు బంధంను విడదీయరానిదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జీతాలు ఇవ్వడమే కాకుండా 73 శాతం పిఆర్‌ఎసి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

21 రోజల పాటు నిర్వహించే ఉత్సవాలపై ప్రతి శాఖ పూర్తి స్థాయిలో డాక్యుమెంటరీని తయారు చేయాలని మంత్రి సూచించారు. జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించి, ఐడిఓసిలో పతాకావిష్కరణ ఉంటుందని, సాయంత్రం లకారంలో సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయని ఆయన తెలిపారు. జూన్ 3న రైతుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని 129 రైతు వేదికల్లో పెద్ద ఎత్తున రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, ద్విచక్రవాహనాలపై ఊరేగింపుగా రైతు వేదికకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని, రైతులకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తదితరాలపై ప్రభుత్వం ఎంత ఖర్చుచేస్తుంది, పథకాలకు పూర్వం పరిస్థితి, ఇప్పటి పరిస్థితి పై అవగాహన కల్పించాలన్నారు.

రైతుబీమా పొందిన కుటుంబంతో వారు పొందిన లబ్ధిని వారితోనే చెప్పించాలన్నారు. ముందస్తు సాగు, పంటల మార్పిడిపై రైతులకు ప్రయోజనాలను వివరించాలన్నారు. జూన్ 4న సురక్షా దినోత్సవం జరపాలని, ప్రజలకు షీ టీమ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, ర్యాలీలు చేపట్టాలని, మంచి పౌరులు, విశిష్ట సేవలందించిన పోలీసులను సత్కరించాలని అన్నారు. జూన్ 5న విద్యుత్ దినోత్సవం పురస్కరించుకుని సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలను విద్యుత్ ధీపాలతో అలంకరించాలని, తెలంగాణకు పూర్వం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, ఇప్పుడు పరిస్థితిపై, విద్యుత్ రంగంలో ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.

జూన్ 6న పారిశ్రామిక ఉత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేయాలన్నారు. ఐటి హబ్‌లో సమావేశం నిర్వహించాలని సూచించారు. జూన్ 7న సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టి, సాగునీటి రంగంలో రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచాలన్నారు. జూన్ 8న చెరువుల పండుగను పురస్కరించుకుని గ్రామ గ్రామాన చెరువుల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని, చెరువు కట్టలపై రాత్రి సమయంలో భోజనాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.

జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబరాలను పురస్కరించుకుని రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవం ఉంటుందని, సాంఘిక సంక్షేమ శాఖ చే సేకరించిన 58 ఎకరాలను భూమిని, ఇండ్లులేని 3000 వేల మందికి పట్టాల పంపిణీ చేయనున్నట్లు, బిసి సంక్షేమ శాఖ ద్వారా కుల వృతుల వారికి రూ.లక్ష రుణాల చెక్కుల పంపిణీ, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ల తదితర లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. జూన్ 10న సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, మండలాలు, గ్రామాల దగ్గర సంబరాలు చేపట్టాలని, కొత్తగా ఏర్పాటుతో కలిగిన ప్రయోజనాలను కరపత్రాల రూపంలో ప్రచురించి ప్రజలకు వివరించాలని అన్నారు.

గ్రామ, మండల, మునిసిపల్, జిల్లా పరిషత్ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అమరులకు నివాళి తీర్మానం, 2 నిమిషాల మౌనం పాటించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2 నిమిషాలు మౌనం పాటించాలని మంత్రి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉత్సవాలు వైభవోపేతంగా చేపట్టాలని మంత్రి తెలిపారు.

  • తెలంగాణ ఉద్యమ ఘాటాలను ఫోకస్ చేయాలి : వద్దిరాజు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, 21 రోజులు ఉత్సవాలు ఘనంగా చేపట్టాలన్నారు. ఉద్యమ సమయంలోని ప్రధాన ఘట్టాలను ప్రధాన కూడళ్ళలో ప్రదర్శించాలని, కెసి ఆర్ ఖమ్మం ఆసుపత్రిలో చేపట్టిన ఆమరణ దీక్ష వల్లనే మలి దశ ఉద్యమం ఉపందుకోని తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణమైందని, సకలజనుల సమ్మె ,సాగర హారం, వంటవార్పు వంటి ప్రధాన ఘాటాల చిత్రాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. 2014కు పూర్వం, 2014 తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలన్నారు. తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ప్రజల్లోకి తెలుపాలన్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో అధికారులతో సమావేశమై వేడుకలు పెద్దఎత్తున ఘనంగా చేపట్టుటకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు. తెలంగాణ సాధనకు చేపట్టిన స్పూర్తిని, సాధించిన తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, వేడుకలను గొప్పగా జరుపుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ, అధికారులకు వేడుకల నిర్వహణపై అవగాహన కల్పించినట్లు, సమన్వయం తో వేడుకలను విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ చే తెలంగాణ రన్ కార్యక్రమాన్ని సెగ్మెంట్ల వారిగా నిర్వహిస్తామని, 21రోజుల పాటుజరిగే కార్యక్రమాల్లో ఎలాంటి అటంకం కలగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు.

సురక్షాదినోత్సవం రోజు సాంస్క్రతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని, షీటీమ్, భరోస,సైబర్ నేరాలు, తెలంగాణ పోలీసుల ప్రతిభ గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ ఎన్. వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News