Thursday, May 2, 2024

జ్వర సర్వేకు నీరాజనం

- Advertisement -
- Advertisement -

Door-to-door fever survey launched across telangana

ఆరోగ్య సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు

వారం రోజుల్లో సర్వే పూర్తి : సిఎస్
కొవిడ్ లక్షణాలున్న వారికి మందుల కిట్లు అక్కడికక్కడే అందజేత
హైదరాబాద్‌లోని హిల్‌టాప్ కాలనీలో ప్రక్రియను పరిశీలించిన సోమేశ్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్‌లోని హిల్‌టాప్ కాలనీలో సిఎస్ పరిశీలించారు. ఈక్రమంలో సిఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ తదితర అధికారులున్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం చేపడుతున్న ఫీవర్ సర్వేకు అన్ని విధాల సహకరించాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ -19 మూడో విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్లు ఆయన వివరించారు. కరోనా మూడో వేవ్‌తో గానీ, ఒమిక్రాన్‌తో గానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోన మూడవ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్‌లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వైద్య పరీక్షల్లో కొవిడ్ లక్షణాలున్న వారికి వెంటనే 5 రోజులకు సరిపడ మందుల కిట్ అందజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కొక్క టీమ్‌లో ఆశా, ఎఎన్.ఎం, మున్సిపల్, పంచాయతీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నవారిని గుర్తించడం, ఒకవేళ కొవిడ్ లక్షణాలు తేలితే వారికి వెంటనే మెడికల్ కిట్‌ను అందజేస్తారని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుతో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైందని సిఎస్ వివరించారు.రాష్ట్రంలో వాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని, గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే విజయవంతం కావడంతో పాటు సత్ఫలితాలనిచ్చిందని సిఎస్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేపట్టిన ఈ ఇంటింటి జ్వర సర్వే ను నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఫీవర్ సర్వేను విజయవంతం చేయాలి : నగర మేయర్

హైదరాబాద్ బంజారాహిల్స్ ఎన్ బిటినగర్‌లో ఫీవర్ సర్వేను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఫీవర్ సర్వేను అన్ని శాఖల అధికారులు కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్‌లు అందిస్తున్నామని చెప్పారు. కరోనా ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో రూ. 500 రూపాయలు మాత్రమే తీసుకోవాలని, ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 60 ఏళ్ల పై పడిన వారందరూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, వ్యాక్సినేషన్ రెండో డోస్ తీసుకోని వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలని మేయర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News