మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ తేదీల ఖరారు తర్వాతనే దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. వాయిదా పడిన ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్పై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. జెఇఇ మెయిన్, ఎపి ఎంసెట్ తేదీలను పరిశీలించి, టిసిఎస్ వద్ద అందుబాటులో ఉన్న స్లాట్లకు అనుగుణంగా సెట్ల తేదీలు ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. జూన్ 22న దోస్త్ 2020 నోటిఫికేషన్ జారీ కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. అలాగే దోస్త్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నుంచి వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకునే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. జులై 22న సీట్ల కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను తాత్కాలిక వాయిదా వేయగా, మరో వారం రోజుల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ తేదీలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dost Notification for degree will release in a week