Friday, May 3, 2024

వజీర్‌ఎక్స్ ఎక్స్ఛేంజ్‌లో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

ED searches on WazirX Exchange

రూ. 100 కోట్లు జప్తు

హైదరాబాద్: చైనా బెట్టింగ్ యాప్ వ్యవహారంలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్, వజీర్‌ఎక్స్‌కు చెందిన నిర్వాహకుల ఇళ్లలో గురు, శుక్రవారాలలో సోదాలు నిర్వహించి ఇడి బెట్టింగ్ రూ. 100 కోట్లు జప్తు చేసింది. ఈక్రమంలో యాప్‌లలో చైనా లోన్‌యాప్‌లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు తనికీలు నిర్వహించిన ఇడి దాదాపు రూ.వంద కోట్లు జప్తు చేయడంతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనా బెట్టింగ్ యాప్‌ల దందాలో భాగంగా రూపాయల్లో ఉన్న సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి కేమన్ దీవుల్లో రిజిస్టర్ అయిన ‘బైనాన్స్ వాలెట్ల’లోకి పంపించినట్లు ఇడి ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంలో ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వజీర్‌ఎక్స్ కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తోంది.

ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా సుమారు రూ.2,790.74 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గతంలోనే గుర్తించింది. ఇందులో నమోదైన ఖాతాల్లోకి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల నుంచి రూ.880 కోట్లు వచ్చాయని, ముఖ్యంగా భారత్ నుంచి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల్లోకి రూ.1400 కోట్లు వెళ్లాయని ఇడి ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఆడిట్ లేదా దర్యాప్తు చేసేందుకు ఈ ఆర్థిక లావాదేవీలు బ్లాక్ చెయిన్స్‌లో అందుబాటులో లేవని, దీన్నిబట్టి ఎక్స్ఛేంజ్ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భారత్ నుంచి విదేశాలకు ఆర్థిక లావాదేవీలు సాగించారని ఇడి అధికారులు అనుమానిస్తున్నారు. తాజా సోదాల్లో వజీర్ ఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ లో రూ. 100 కోట్ల మేరకు జప్తు చేయడంతో పాటు ఈ సంస్థ డైరెక్టర్లు నిశ్చల్ శెట్టి, సమీర్ హనుమాన్‌కు ఇడి నోటీసులు పంపించింది. బిట్‌కాయిన్, ట్రాన్, లిట్‌కాయిన్, రిప్పల్ వంటి డిజిటల్ కరెన్సీల రూపంలో లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు కంపెనీపై ఆరోపణలు రావడంతో ఇడి అధికారులు తనికీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సోదాలలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఇడి అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News