Sunday, April 28, 2024

కాంగ్రెస్‌కు మరో షాక్

- Advertisement -
- Advertisement -

ఆదాయపు పన్ను (ఐటి) శాఖ తమకు వ్యతిరేకంగా చేపట్టిన పన్ను తిరిగి మదింపు ప్రక్రియలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. 2014 నుంచి 2017 వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు పన్ను తిరిగి మదింపు వేయడానికి ఐటి శాఖ ప్రయత్నించింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషైంద్ర కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ తరఫున హాజరైన అభిషేక్ మను సింఘ్వి, ఐటి శాఖ తరఫున హాజరైన జోహెబ్ హుస్సేన్ వాదనలు విన్న తరువాత కోర్టు బుధవారం (20న) తన తీర్పును రిజర్వ్ చేసింది. తిరిగి పన్ను మదింపు ప్రక్రియలను కాంగ్రెస్ సవాల్ చేసింది. ఐటి శాఖపై ‘పరిమితి కట్టడి ఉంది’ అని, ఐటి శాఖ గరిష్ఠంగా ఆరు మదింపు సంవత్సరాలకు తిరిగి వెళ్లి ఉండవలసిందని పార్టీ వాదించింది.

అయితే, పన్ను ప్రాధికార సంస్థ ఏ చట్టబద్ధమైన నిబంధననూ ఉల్లంఘించలేదని ఐటి శాఖ స్పష్టం చేసింది. స్వాధీనం చేసుకున్న సాధనాల ప్రకారం, కాంగ్రెస్ ‘తప్పించుకున్న’ ఆదాయం రూ. 520 కోట్ల పైనే ఉందని ఐటి శాఖ ఆరోపించింది. రూ. 100 కోట్లకు పైగా బకాయిల వసూలుకు ఐటి శాఖ జారీ చేసిన నోటీస్‌పై స్టే ఇవ్వడానికి కాంగ్రెస్ అర్జీని తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ నెలారంభంలో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటిఎటి) ఉత్తర్వును ధ్రువీకరించింది. ‘(సదరు) ఉత్తర్వు విషయంలో జోక్యానికి మాకు ఏ కారణమూ కనిపించడం లేదు’ అని జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే, పరిస్థితులు ఏవైనా మారిన పక్షంలో ఐటిఎటిని తిరిగి ఆశ్రయించేందుకు కాంగ్రెస్‌కుఢిల్లీ హైకోర్టు స్వేచ్ఛ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News