Friday, May 3, 2024

మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -
తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న తొలితరం నేతగా ప్రసిద్ధి
సిఎం కెసిఆర్ సంతాపం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌కు చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి అనంతరం రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, అప్పటి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట శాసనసభ్యునిగా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా, రాజ్యసభలో ఆ పార్టీ నాయకులుగా, రాజ్యసభ హామీల అమలు స్థాయి సంఘం సభ్యులుగా, పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించారు. ఇటీవలి కాలంలోనూ భారత చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు. లోక్ సత్తాలో కూడా కొంతకాలం కలిసి ప ని చేశారు. 70ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారు. సోలిపేట రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మహాకవి డాక్టర్ సి. నారాయణరెడ్డి చిన్న కుమార్తెను తమ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్ శాసనసభ్యుల నివాసాల్లో 272 ఏ లో ఉంచారు. ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల సిఎం కెసిఆర్ సం తాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ‘సోలిపేట’ జీవితం ఆదర్శవంతమైనదని సిఎం తెలిపారు. ఆయన రాజకీయ జీవితంలో సర్పంచి స్థా యి నుంచి ఎంఎల్‌ఎగా, ఎంపీగా ప్రజా జీవితంలోఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సిఎం పేర్కొన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ. సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచారని అన్నారు. సోలిపేట మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోలిపేట మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. రామచంద్రరెడ్డి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News