Sunday, April 28, 2024

కర్నాటక బస్సుప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఆర్దిక సహాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to families of those killed in Karnataka bus accident

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన కర్ణాటకలో కలబురగి వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదం దుర్ఘటన చాలా బాధాకరమంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌లోని బొల్లారం కు చెందిన అర్జున్ కుమార్, అతని భార్య సరళ, కుమారుడు వివన్, కె.అనిత, గోదేఖీ ఖబర్ కు చెందిన శివకుమార్, అతని భార్య రవళి, కుమారుడు దీక్షిత్ లు మరణించగా, మరో 7 గురు గాయపడ్డ విషయం తెలిసిందే. వీరందరికీ ప్రభుత్వం తరుపున మంజూరు చేసిన ఆర్ధిక సహాయాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేసాయన్న, కలెక్టర్ శర్మన్ లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరిగిన రోజే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చెప్పరన్నారు.

అంతేకాకుండా మానవతా దృక్పధంతో ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, గాయపడిన వారికిరూ. 50 వేట చొప్పున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మేరకు ప్రభుత్వం రూ.24.50 లక్షల మంజూరు చేయగా, ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓలు వసంత కుమారి, వెంకటేశ్వర్లు, తహసిల్దార్ లు హసీనా, ప్రసాదరావు, నవీన్, కంటోన్మెంట్ మాజీ బోర్డ్ సభ్యులు లోకనాధం తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News