Sunday, April 28, 2024

ఇంకా ఐదు రోజులే…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : సర్పంచ్‌లు సర్దుకుంటున్నారు. ఐదు సంవత్సరాల పదవి కాలం మరో ఐదు రోజుల్లో ముగుస్తుండటంతో ముఠా, ముల్లే సర్దుకోవడంతో పాటు కొందరు అందినకాడికి దండుకునే పనులు జోరుగా చేస్తున్నారు. కోట్లు వెచ్చించి ఐదు సంవత్సరాల కోసం సర్పంచ్ పదవి దక్కించుకున్న నేతలు కాలం కలిసి రాక…కరోనా కష్టాల వంటి అదనపు సమస్యలతో ఐదు సంవత్సరాల కాలం హరతీ కర్పూరంల కరిగి పోయిందన్న బాధతో కనిపిస్తున్నారు. దీపం ఉన్నపుడు ఇళ్లు చక్కబెట్టుకోవడానికి కొంత మంది శివారు సర్పంచ్‌లు ప్రయత్నించి సఫలం అయిన గ్రామీణ ప్రాంత సర్పంచ్‌లు మాత్రం పదవి పోవడంతో పాటు అప్పులు మాత్రం ఆలాగే ఉన్నాయన్న బాధలో కనిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 558, వికారాబాద్ జిల్లాలో 566, మేడ్చల్ జిల్లలో 61 గ్రామ పంచాయతీలున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని శివారు గ్రామ పంచాయతీలతో పాటు వికారాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో రియల్ వ్యాపారం పుణ్యమా కొంత మంది సర్పంచ్‌లు గ్రామాలను అభివృద్ధ్ది చేయడంతో పాటు ఆర్థికంగా సైతం పటిష్టంగా మారిన చాలా మంది సర్పంచ్‌లు దీనపరిస్థితులు ఎదురుకుంటున్నారు.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని శివారు సర్పంచ్‌లు మాత్రం పెట్టిన పెట్టుబడులకు పదిరేట్లు సంపాదించుకుని మరో మారు సర్పంచ్,మరో పదవిపై ఫోకస్ పెట్టి ఖర్చు ఎంతైన సరే సై అనడానికి కాలు దువుతున్నారు. జనవరి 31తో పదవి కాలం ముగియనుండటంతో గత ఆరు నెలలుగా తమ దందాల జోరు పెంచారు. అక్రమ లేవుట్‌లు, అక్రమ నిర్మాణాలతో పాటు పనులు ఎదైన తమకు కావలసినది ముట్ట చెప్పితే క్షణాల్లో పనులు చక్కబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. జిల్లా పంచాయతీ అధికారులు మౌనమునులుగా మారడంతో గత రెండు మూడు నెలలుగా అక్రమ లేఆవుట్‌లు, నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని కనీస రికార్డులు నిర్వహించడం లేదని సమాచారం. సర్పంచ్‌ల పదవి కాలం ముగుస్తుండటంతో ప్రత్యేక టిమ్‌లు రంగంలోకి దించి తమ ఇలాకాలో సాగుతున్న లేఆవుట్‌లు, నిర్మాణాలు ఇతరత్రా వాటి వద్దకు పంపి బలవంతపు వసూళ్లు పెద్ద ఎత్తున చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. వారం రోజులు తప్పించుకుని తిరిగితే చాలు అనే రీతిలో రియల్టర్‌లు, బిల్డర్‌లు పలాయనం చిత్తగిస్తున్నారు.

జనవరి 31 తో పదవి కాలం ముగిసిన అనంతరం సైతం పాత తేదిలలో సంతకాలు చేసి అనుమతులు ఇవ్వడానికి చాలా మంది సర్పంచ్‌లు కావలసిన చీకటి ఏర్పాట్లు సైతం ఇప్పటికే చేసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో ఉన నిధులను పూర్తిగా వెచ్చించి గ్రామాల్లో చేసిన అభివృద్ధ్ది పనులను పూర్తిగా తాము అదీకారంలో ఉన్నప్పుడే ప్రారంబించడానికి పలువురు సర్ప ంచ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్పంచ్‌లుకు కొన్ని ప్రాంతాల్లో శాసనసభ్యులు సహకరిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయతీలలో నిధులు మాత్రం ఖాళీ అవుతున్నాయి.

ప్రత్యేక పాలనలోకి…. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు లేవని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేయడంతో ఆశావహూలు ఆశలు వదులుకున్నారు. ఎన్నికలు ఆలస్యం కావడంతో పాటు రిజర్వేషన్‌లు సైతం మారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు వెళ్లనున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచాయతీలు ప్రత్యేక పాలనలోకి వెళ్లడం ఇదే ప్రథమం. మండల స్థాయి అధికారులతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాద్యాయులను ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. జనబా ఐదు వందలు ఉన్న గ్రామాలను సైతం పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ప్రత్యేక అధికారుల సంఖ్య పెరగనుంది.

చిన్న చిన్న గ్రామాలను రెండు మూడు కలిపి ఒకరికి ఇంచార్జీలుగా ఇవ్వనుండగా శివారులోని పెద్ద గ్రామాలకు మాత్రం ఒకరినే నియమించనున్నట్లు సమాచారం. జిల్లా పంచాయతీ అధికారులు ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసినట్లు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన అనంతరం ప్రత్యేక పాలనలోకి పంచాయతీలు వెళ్లనున్నాయి. సర్పంచ్‌ల పదవి కాలం ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారులు పంచాయతీల రికార్డులను పూర్తి స్థాయిలో తమ ఆదీనంలోకి తీసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. సర్పంచ్‌ల పదవి కాలం ముగియనుండటంతో వారిని సాదరంగా వీడ్కోలు పలకడానికి సైతం పలు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంబమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News