రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా
ఖరీఫ్లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు
అర్థ గణాంక శాఖ రెండో ముందస్తు అంచనా నివేదికలో వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరగనుంది. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2019 ఖరీఫ్, రబీల్లో కలిపి 130 లక్షల మెట్రిక్ టన్నుల (1.30 కోట్లు మె.ట) ఉత్పత్తి అంచనా వేశారు. గతేడాది కంటే ఈ మొత్తం 37.26 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. అంటే 40.17 శాతం పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర అర్థ గణాంక శాఖ రెండో ముందస్తు అంచనాల నివేదికలో వెల్లడించింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖలకు అధికారులు నివేదించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు, కాళేశ్వరంలో పాటు ఇతర ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో సాగు విస్తీర్ణం సాధారణ అంచనాలను మించి నమోదైంది. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో వస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
వరి, మొక్కజొన్న, కందుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 97.43 లక్షల ఎకరాలలో ఆహార పంటలు సాగయ్యాయి. గతేడాది పోలిస్తే 29.02 శాతం సాగు అధికంగా నమోదైంది. ఇందులో వరి ఖరీఫ్లో 37.09 శాతం, రబీలో 53.7 శాతం అధికంగా సాగైంది. ఖరీఫ్లో 78.68 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాగా, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు రానున్నట్లు అర్థ గణాంక శాఖ అంచనా వేసింది. పప్పు పంటల సాగు 13.10 లక్షల ఎకరాల్లో కాగా, ఉత్పత్తి మొత్తం 4.67 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది గతేడాది కంటే 27 వేల టన్నులు అధికం. పసుపు ఉత్పత్తి గతం కంటే 14 వేల మెట్రిక్ టన్నులు తగ్గింది. ఈసారి 3.05 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేశారు. అలాగే మిర్చి ఉత్పత్తి ఈసారి 24 వేల మెట్రిక్ టన్నులు పెరిగి 3.28 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి రానున్నట్లు పేర్కొన్నారు.
వరి అదరహో
రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు, దిగుబడి పెరగడంతో ఉత్పత్తి పెరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లలో వరి 68.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 201819తో చూస్తే 20.76 లక్షల ఎకరాలు అధికంగా సాగవడం గమనార్హం. దీంతో వరిధాన్యం ఉత్పత్తి కూడా భారీగా వస్తోందని అర్థగణాంక శాఖ తెలిపింది. ఖరీఫ్లో ఏకంగా 89.49 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 58.62 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి రానున్నట్లు అంచనా వేసింది. గత ఖరీఫ్తో చూస్తే 2019లో 44.32 శాతం ఉత్పత్తి, రబీలో 54.22 శాతం పెరుగుతోంది. ఈ రెండు సీజన్లలో కలిపి 148.11 లక్షల మెట్రిక్ టన్నులు రానున్నట్లు పెర్కొంది. గతేడాదితో చూస్తే ఏకంగా 48.09 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెరగడం విశేషం. ఇక మొత్తం బియ్యంగా మారిస్తే 66.67 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని నివేదికలో వివరించారు.
కంది దిగుబడి.. పత్తి ఉత్పత్తి పెరుగుదల
కంది పంట ఖరీఫ్లో 7.29 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే స్వల్పంగా తగ్గింది. అయితే ఉత్పత్తి మాత్రం 15 వేల మెట్రిక్ టన్నులు పెరిగింది. దిగుబడి పెరగడంతోనేనని నివేదికలో వివరించారు. ఈసారి కందుల ఉత్పత్తి 2.07 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనాల్లో పేర్కొన్నారు. గతేడాది ఇది 1.92 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇక పత్తి రాష్ట్రంలో ప్రధాన పంట. ఈసారి 52.24 లక్షల ఎకరాల్లో సాగైంది. గతం కంటే 2.75 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు నమోదైంది. అయితే ఉత్పత్తి 48.62 లక్షల బేల్స్ (ఒక్క బేల్ 170 కేజీలు) గా అంచనా వేసింది. గతేడాది కంటే ఇది 13.48 లక్షల మెట్రిక్ టన్నులు అధికం కావడం గమనార్హం.
మొక్కజొన్న పెరిగి.. వేరుశనగ తగ్గి
ఇక మొక్కజొన్న రెండు సీజన్లలో కలిపి 13.69 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది కంటే 27 వేల ఎకరాలు అధికంగా రైతులు సాగు చేశారు. మొత్తం ఉత్పత్తి 25.59 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు అంచనాల్లో తెలిపారు. గత సంవత్సరంతో చూస్తే 4.77 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా వస్తోంది. ఖరీఫ్లో 15.65 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 9.94 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరగడం ఉత్పత్తి పెరుగుదలకు కారణం కాగా అలాగే కత్తెర పురుగు దాడి ఈసారి తగ్గినట్లు అర్థగణాంక శాఖ నివేదికలో వెల్లడించారు. అలాగే పెసర గతేడాది ఈసారి ఒకే ఉత్పత్తి రానుంది. 48 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. మినుముల ఉత్పత్తి పడిపోయింది.
గతంలో 31 వేల మెట్రిక్ టన్నులు రాగా ఇప్పుడు 18 వేల టన్నులకే పరిమితమైంది. సోయాబీన్ 88 వేల మెట్రిక్ టన్నులు పెరిగి ఈసారి 3.22 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతి వచ్చింది. శనగ పంట 1.46 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 1.89 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. గతేడాది కంటే 1.04 లక్షల ఎకరాలు అధికంగా సాగు కావడంతో ఉత్పత్తి కూడా 25 వేల మెట్రిక్ టన్నులు పెరిగింది. వేరుశనగ 3.27 లక్షల ఎకరాల్లో సాగు కాగా గతం కంటే 32 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి తగ్గింది. 2.83 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తోందని నివేదించారు. నూనె గింజల ఉత్పత్తి ఈసారి పెరిగింది. 8.278 లక్షల ఎకర్లాలో సాగు నమోదు కాగా, 6.64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. గత సంవత్సరం కంటే 42 వేల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం.
రెండో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నుల్లో
సంవత్సరం ఖరీఫ్ రబీ మొత్తం
2014-15 44.72 27.46 72.18
2015-16 35.75 15.70 51.45
2016-17 52.22 49.07 101.29
2017-18 49.37 46.83 96.20
2018-19 57.50 35.25 92.75
2019-20 78.68 51.33 130.01
అర్థగణాంక శాఖ మొదటి, రెండో ముందస్తు అంచనా నివేదికలు (ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నుల్లో)
పంట మొదటి అంచనాల్లో రెండో అంచనాల్లో
వరి 66.62 39.08
మొక్కజొన్న 13.79 9.94
కందులు 1.94 2.07
పెసర 45,664 48,000
ఆహార ధాన్యాలు 83.44 51.33
వేరుశనగ 30,744 2.48
పత్తి ( లక్షల బేల్స్లో) 45.93 48.62