Sunday, April 28, 2024

హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఎసిబి కోర్టులో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

బెయిల్ పిటిషన్ కొట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఎసిబి కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఎసిబి కోర్టు కొట్టివేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఎసిబి దర్యాప్తులో శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శివబాలకృష్ణ అవినీతి కేసులో ఓ  ఐఎఎస్‌ను విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణకు సంబంధించి సదరు ఐఎఎస్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం. శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయవద్దని ఎసిబి అధికారులు కౌంటర్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి ఎసిబి కోర్టు హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

ఎసిబి విచారణలో శివ బాలకృష్ణ అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆయనకు తెలంగాణతో పాటు ఎపిలోనూ భారీగా ఆస్తులు ఉన్నట్లు ఎసిబి గుర్తించింది. దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా శివబాలకృష్ణ అక్రమాస్తుల లెక్కలు చూసి అధికారులు విస్తుపోతున్నారు. శివబాలకృష్ణకు 214 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఎసిబి గుర్తించింది. దాంతోపాటు 29 ప్లాట్స్, విలాసవంతమైన విల్లాలు, బంగారం, ఖరీదైన వాచ్‌లు, ఖరీదైన మొబైల్స్ శివబాలకృష్ణ వద్ద ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ప్రస్తుత మార్కెట్ ప్రకారం చూస్తే ఈ అవినీతి అనకొండ ఆర్జించింది రూ. 250 కోట్లు ఉంటుందని ఎసిబి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మొత్తం లెక్కలు తేలితే వీటి విలువ రూ.1000 కోట్లు దాటవచ్చునని భావిస్తున్నారు. జనవరి 24న ఎసిబి అధికారులు శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఎసిబి కోర్టు అనుమతితో అధికారులు ఎనిమిది రోజులపాటు కస్టడీకి తీసుకుని హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్‌ను విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివరామకృష్ణ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఈ స్థాయిలో ఆదాయాన్ని కూడబెట్టారు? అని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News