Friday, May 3, 2024

1000 హరిత గ్రామాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరిత భవనాల అభివృద్ధి రంగంలో దేశంలోనే మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్‌పోర్టు వంటి లాంటివి రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్ బిల్డింగ్ విధానంతో నిర్మించామని చెప్పారు. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఐఐ-ఐజిబిసి, హరితహారం కార్యక్రమాలకు నిరంతరం సహకారం ఉంటుందన్నారు.

సిఎం కెసిఆర్ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్ కవర్ 33 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కొత్త సచివాలయ భవనం, టి -హబ్, టి వర్క్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త కలెక్టరేట్ భవనాలు, ఆస్పత్రులు, హెల్త్ కేర్ క్యాంపస్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటి టవర్లలో గ్రీనరీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తెలంగాణ పచ్చని బాటలో నడుస్తోందని మంత్రి చెప్పారు. భవనాలు, క్యాంపస్‌లే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐజిబిసి ద్వారా గ్రీన్ సిటీస్ రేటింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు హరిత హారం ద్వారా రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33 శాతం వరకు పచ్చదనం పెరిగిందని మంత్రి చెప్పారు. చెట్ల విస్తరణను గణనీయంగా పెంచుకున్నామని, దీంతో రాష్ట్రం మొత్తం పచ్చదనం పెరిగిందని తెలిపారు. నగరాలేగాక రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో కూడా గ్రీన్ బిల్డింగ్ సూత్రాలను అవలంభించాలని కోరుకుంటున్నామని చెప్పారు.

గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలన్నారు. గ్రామీణ విద్యుదీకరణ, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణను మెరుగుపర్చడానికి, గ్రామాలు పచ్చగా మారడానికి వీలుగా పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనపై తాము దృష్టి పెడుతున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, సిఐఐ తెలంగాణ చైర్మన్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News