Sunday, April 28, 2024

మహిళా ప్రయాణికులకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టి-24 టికెట్‌ను రూ.80లకే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90లుగా, సీనియర్ సిటీజన్‌లకు రూ.80లుగా ఇటీవల టిఎస్ ఆర్టీసి యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకు రూ.10 తగ్గించి రూ.80లకే అందించాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ప్రతి రోజు సగటున 40 వేల వరకు టికెట్‌ల అమ్మకం
ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండి విసి సజ్జనార్ తెలిపారు. సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయా ణించే ఆ టికెట్ ధరను రూ.100ల నుంచి రూ.90లకు సంస్థ ఇటీవల తగ్గించిందని, కొత్తగా సీనియర్ సిటీజన్లకు రూ.80లకే ఆ టికెట్‌ను అంది స్తోందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయన్నారు. గతంలో రోజుకు రూ.25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గర అయ్యేందుకు రూ.80లకే టి-24 టికెట్ అందించాలని సంస్థ నిర్ణయించిందని వారు పేర్కొన్నారు.
సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్
మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50లకు ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని వారు చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వారు వివరించారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో రూ.300లు చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని వారు తెలిపారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టిఎస్ ఆర్టీసిని ప్రజలు ఆదరించాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News