Wednesday, May 1, 2024

భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు

- Advertisement -
- Advertisement -

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టిఎస్ ఆర్టీసి లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టిఎస్ ఆర్టీసి హోం డెలివరీ చేస్తుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్, ఐపీఎస్ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన ప్రారంభించారు.

గతేడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలు
నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టిఎస్ ఆర్టీసి యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా గతేడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ అన్నారు. భద్రాద్రిలో ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు

ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని అన్ని టిఎస్ ఆర్టీసి లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చన్నారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్‌లను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ 040-23450033, 040-69440000, 040-69440069 ఫోన్ నంబర్‌లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఆర్టీసి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సిటిఎం(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News