Friday, May 3, 2024

పేదల సంక్షేమమే సర్కార్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మరిపెడ: పేదల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సిఎం కెసిఆర్‌ను గుండెల్లో పెట్టుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని నీలికుర్తి, పర్కజాలతండా గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆయా గ్రామాల్లో బిఆర్‌ఎస్ శ్రేణులు రెడ్యానాయక్‌కు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నీలికుర్తి సర్పంచ్ గుడిపుడి శ్రీనివాసరావు, పర్కజాలతండా సర్పంచ్ బానోతు కమ్లీ లాలునాయక్‌ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడోసారి ముచ్చటగా సిఎం కెసిఆర్ గెలుపొందడం ఖాయమన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. నాడు కరెంట్ ఉంటే వార్త అని, నేడు కరెంట్ పోతే వార్త అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కరెంట్ 7 గంటలుంటే, అందులో ఉదయం 4 గంటలు, రాత్రి 3 గంటలు వచ్చేదని, దీంతో రాత్రి సమయంలో పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి చాల మంది రైతులు వృత్యువాత పడ్డారని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించి పుష్కలంగా సాగునీరు, రైతు బంధు, రైతు భీమా, సకాలంలో ఎరువులు, విత్తలు అందించడంతో వ్యవసాయం పండుగాలా మారి తెలంగాణ నేడు అన్నపూర్ణగా మారి దేశానికే అన్నం పెట్టేస్ధాయి ఎదిగిందన్నారు. రైతుల ఇబ్బంది పడకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. ఇంటి జాగలు ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని, అర్హులైన వారికి దళిత బంధు పథకం కింద యూనిట్లు అందజేస్తామన్నారు. గ్రామాల్లో ఉన్న తాగునీరు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను అదేశించారు. కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి బిఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేళ్లలో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ న్యాయం చేశారని తెలిపారు.

14 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా పని చేసిన నాయకుడినే ప్రజలు ఆదరిస్తారని, తన జీవితం ప్రజాసేవకే అంకితం చేశాన్నారు. ప్రజలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా కార్యకర్తలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్షంగా అహర్నిశలు కృషి చేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాని ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, గుగులోతు వెంకన్న, రామడుగు అచ్యుత్‌రావు, గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, ఎంపిటిసి గుగులోతు భాస్కర్, ఉప సర్పంచ్‌లు నరేష్, గుగులోతు సురేష్, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, ఎంపిఓ పూర్ణచందర్‌రెడ్డి, పిఆర్ ఏఈ శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు గాదెగాని నాగన్న, సైదులు, నాయకులు తొట్టి సత్యం, మీనయ్య, మనోహర్, బానోతు కొండయ్య, శ్రీను, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News