న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వివిధ రంగాల సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈమేరకు 12 కోట్ల మంది ఉద్యోగుల వేతనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బుధవారం ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అలాగే తమ పార్టీ ప్రతిపాదించిన విధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నుంచి బయటపడే వ్యూహాన్ని రూపొందించాలని, వివిధ ప్రాంతాల్లో నిల్చిపోయిన వలస కార్మికుల పరిస్థితిని పట్టించుకోవాలని కోరారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయంపై స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో ప్రైవేట్ రంగం భారీ ఎత్తున రిట్రెంచ్మెంట్లు, లేఆఫ్లు ప్రకటించడానికి బలవంతంగా సిద్ధమవుతోందని దీనివల్ల కొన్ని లక్షల మంది జీవిత ఉపాధి దెబ్బతింటుందని ఆయన చెప్పారు. ప్రధాని అత్యవసరంగా తగిన చర్యలు తీసుకుని ప్యాకేజి ప్రకటించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాత్రికేయులతో చిదంబరం మాట్లాడారు.