న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తక్షణం ఆరోగ్యసేతు యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించాలని ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. ఈ యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కోరింది. తమ కార్యాలయాలకు బయలు దేరే ముందు యాప్లో తమ ఆరోగ్యసమాచారాన్ని సమీక్షించుకోవాలని యాప్లో ‘సేఫ్’ లేదా లోరిస్క్ అని సూచిస్తేనే కార్యాలయానికి బయలు దేరాలని సూచించింది. కార్యాలయానికి బయలు దేరిన సమయంలో బ్లూటూత్ సహాయంతో యాప్ తమ సమీప ప్రాంత ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషిస్తుంది. మోడరేట్ లేదా హైరిస్కు అని యాప్ సూచిస్తే ఆ ఉద్యోగి పై అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు కార్యాలయానికి వెళ్లకుండా యాప్ స్టేటస్ సేఫ్ లేదా లోరిస్కు అని సూచించే వరకు 14 రోజుల పాటు ఐసొలేషన్లో ఉండవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ప్రభుత్వ విభాగాల్లోని సీనియర్ ఆఫీసర్ నుంచి జాయింట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్ ) వరకు ఈ ఉత్తర్వులు కచ్చితంగా పాటించవలసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.