ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు
ఆర్టిఐ దరఖాస్తుకు ఎన్ఐసి జవాబు
షోకాజ్ నోటీసులు జారీచేసిన సిఐసి
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్ను ఎవరు తయారు చేశారో, ఎలా తయారు చేశారో తమ వద్ద సమాచారం లేదంటూ ప్రభుత్వ వెబ్సైట్లను డిజైన్ చేసే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసి) చెప్పడంపై ప్రధాన సమాచార కమిషన్(సిఐసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్-19 కాంటాక్ట్లను గుర్తించే ప్రక్రియపై సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి కోరిన సమాచారంపై ఆరోగ్య సేతు యాప్ గురించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదంటూ ఎలెక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఎన్ఐసి సమాధానం ఇవ్వడంపై సిఐసి మండిపడింది. ఆర్టిఐ కింద వచ్చిన దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలంటూ వివిధ ప్రభుత్వ సమాచార అధికారులకు ఎన్ఐసి షోకాజ్ నోటీసులు జారీచేసింది. సమాధానాన్ని దాటవేయడానికి వీల్లేదంటూ కూడా ఎన్ఐసి ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది భారతీయులు డౌన్లోడ్ చేసుకున్న ఆరోగ్య సేతు యాప్ తయారీకి సంబంధించిన సమాచారం కోరుతూ సౌరవ్ దాస్ అనే వ్యక్తి ఆర్టిఐ కింద ఎన్ఐసి, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్(ఎన్ఇజిడి), ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్రకారం రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలో ప్రవేశించడానికి ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. అయితే ఆ యాప్ తయారీకి సంబంధించి తాను కోరిన సమాచారాన్ని ఎన్ఐసి కాని మంత్రిత్వశాఖ కాని ఇవ్వలేదంటూ సౌరవ్ దాస్ సిఐసికి ఫిర్యాదు చేశారు.
ఆరోగ్య సేతు యాప్కు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోతే వెబ్సైట్పై ఎందుకు మీ పేరు ఉందని కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ను సిఐసి నిలదీసింది. దీనికి సంబంధించిన సమాచారం ఏదీ మీ వద్ద లేకపోతే ఆరోగ్య సేతు యాప్ను ప్రభుత్వ డొమైన్లో ఎలా తయారు చేశారో సిపిఐఓ, ఎన్ఐసి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సమాచార కమిషనర్ వనజా శర్మ ఆదేశించారు.
CIC Issues notice to NIC reply to RTI on Aarogya Setu