Sunday, April 28, 2024

రాష్ట్రానికి చెందిన ఐదు నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు

- Advertisement -
- Advertisement -
ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు
ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఐదు నిర్మాణాలు గ్రీన్ యాపిల్ అవార్డులను గెలుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ అవార్డులను లండన్‌లో అందుకున్నారు. సచివాలయం, మొజాంజాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయానికి గ్రీన్ యాపిల్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ కేటగిరి కింద ఈ అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనత. ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పట్టాయి. రాష్ట్రానికే ఇప్పటికే వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు (2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్(2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డు, స్మార్ట్‌సిటీ ఎక్స్‌ఫో వరల్డ్ కాంగ్రెస్(2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకుంది.

ప్రతి రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా

లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రిల్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. ఇప్పుడు ఈ సంస్థ తెలంగాణ కట్టడాలకు అవార్డులను ఇచ్చింది. ఈ అవార్డులు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 9 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘనతను సాధించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటై అన్నిరంగాల్లో అనేక మార్పులు తీసుకువస్తూ దేశంలోనే ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఉంటూ దిక్సూచిలా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులతో పాటు స్వచ్ఛ అవార్డులు, ఉత్తమ గ్రామ పంచాయతీలు అనేక అవార్డులు గెలుచుకుంటూ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎదుగుతూ ముందంజలో ఉందని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ శ్వేతసౌధం సచివాలయం
హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మితమైన అద్భుత కట్టడం తెలంగాణ శ్వేతసౌధం. కేవలం రెండు సంవత్సరాల్లోనే నిర్మాణం పూర్తి చేసుకొని గ్రీన్‌ఫీల్డ్ కట్టడంగా నిర్మించారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇది అవార్డును అందుకుంది.
రెండు స్తంభాలతోనే కేబుల్ బ్రిడ్జి
కేవలం రెండు స్తంభాలతోనే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇందులో ఒక్కో స్తంభానికి 13 కేబుళ్లు ఉంటాయి. ఇది జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వరకు ట్రాఫిక్ భారాన్ని తగ్గిస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ పర్యావరణానికి హాని కలగకుండా నిర్మించిన అద్భుత కట్టడం.. ఇప్పుడు గ్రీన్ యాపిల్ అవార్డును సొంతం చేసుకుంది.
పర్యావరణానికి నష్టం కలగకుండా యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించి పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు ఈ కట్టడానికి అంతర్జాతీయ అవార్డు వరించింది.
భవిష్యత్ బేరీజు వేసుకొని కమాండ్ కంట్రోల్ రూం
ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను నిర్మించారు. దీనికి ఇప్పుడు అంతర్జాతీయంగా పేరు వచ్చింది.
మొజాంజాహీ మార్కెట్‌కు ఘనచరిత్ర
మొజాంజాహీ మార్కెట్‌కు నిజాం కాలం నుంచి ఘన చరిత్ర ఉంది. ఎటుచూసిన పచ్చని చెట్లతో అద్భుతంగా ఉంటూ నిజాం శైలి ఉట్టి పడేలా ఉంటుంది. శిథిలావస్థకు చేరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అద్భుతంగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఈ కట్టడానికి గ్రీన్ యాపిల్ అవార్డు వచ్చింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News