Wednesday, May 1, 2024

యునానీ వైద్యంతో.. అద్భుతమైన ఫలితాలు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: యునానీ వైద్యంతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని, దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌ పెట్ట వచ్చునని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని కోర్టు పక్కన ఎన్జీఓ భవన్ లో ఆయూష్ ఆధ్వర్యంలో ఉచిత యునాని మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం కల్పించి, నమ్మకం, విశ్వాసాన్ని కలిగించి ప్రజా ఆదరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలా పొందేలా ఆయూష్, యునాని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారుల మంత్రి హితవుపలికారు. యునానీ మందులు ప్రకృతి నుంచి తయారు చేసినవనీ, ఆయూష్‌ విభాగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 11వ తేదీ జాతీయ యునాని దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయూష్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యునాని వైద్యం ఒకప్పుడు ప్రముఖంగా ఉండేదని, కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు రావడంతో కొద్దిగా వెనుక ఉన్నట్లు చూస్తామని, ఛార్మీనార్ యునాని ఆసుపత్రికి పక్క రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి తమ దీర్ఘకాలిక రోగం నయం చేసుకుని వెళ్తారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు, శారీరక, మానసిక వ్యాధులకు, కీళ్ల నొప్పులు, జీర్ణ కోశ, షుగర్, పక్ష వాతం, ఎలర్జీ, ఆస్తమా, తదితర వ్యాధులకు ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం ఒక్క యునానీలోనే అందుబాటులో ఉన్నదని, అనుభవజ్ఞులైన యునాని వైద్యులు ఉచితంగా చికిత్స చేసి మందులు అందిస్తున్నట్లు వివరించారు.
యునాని గ్రీకు దేశంలో పుట్టి, నిజాం పరిపాలనతో ప్రాచుర్యంలోకి వచ్చి, 4, 5 రకాలుగా ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు, వాటిలో హోమియోపతి, నాచురోపతి, అల్లోపతి, ఆయుర్వేద, యునాని ద్వారా సేవలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో హోమియో, ఆయుర్వేద, యునాని, నాచురోపతిలో మెడికల్ కళాశాలలు నడుపుతున్నట్లు వివరిస్తూ.. రేపటి తరాలకు ఆయూష్ వైద్య సేవలు ఉండేలా.. బలోపేతం దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయించి కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయూష్ విభాగం కింద హెల్త్ వెల్ నెస్ సెంటర్లు ఉన్నాయని, వీటి అభివృద్ధి కై ఒక్కో వెల్ నెస్ సెంటరుకు రూ.6 లక్షల 80 వేల రూపాయల చొప్పున రూ.29 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. హెల్త్ వెల్ నెస్ కేంద్రాలు ప్రజలకు ఉపయోగపడేలా విరివిగా వినియోగంలో తేవాలని కోరారు. యునాని ఆయూష్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం, తొగుట, మిరుదొడ్డిలో మూడు సెంటర్లు ఉన్నాయని, సిద్దిపేట జిల్లాలో 30వరకూ యునాని ఆసుపత్రులు ఉన్నాయని, వాటిలో ఓపీ పెరిగేలా సమయపాలన పాటించాలని ఆయూష్ వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.

Harish Rao inaugurates Ayush health Centre in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News