Monday, April 29, 2024

ముసురు ముట్టడిలో రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రమంతటా ముసురు పట్టి జడివాన కురుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింతగా ఉంది. తెలంగాణలో మరో ఐదు రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరో తొమ్మది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న మంచిర్యాల ,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. | భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్,నిర్మల్, ఖమ్మం , మహబూబాబాద్ , వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ,ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం , దక్షిణ ఒడిస్సా తీరంలో ఉండి సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మి ఎత్తు వరకూ కొనసాగుతూ ,ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపునకు వంగి ఉంది. ఈ ఆవర్తనం ప్రభావం వల్ల రాగల 24గంటల్లో వాయువ్య పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో అల్పపీడనం దక్షిణ చత్తీస్‌గఢ్ మీద స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తణం కారణంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణశాఖ. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం వరకు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తూ వాతావరణశాఖ.ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగురు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది.

సాధారణ స్థాయికి చేరిన వర్షపాతం:
రాష్ట్ర మంతటా గడిచిన 24గంటలుగా 27.6మి.మి సగటు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకూ 254.3 మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుండగా, గత మూడు రోజుల నుంచి ముసురుపట్టి కురుస్తున్న ఈ వర్షాలతో ఇప్పటివరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 230.4 మిల్లీ మీటర్లకు చేరుకుంది.బుధవారం అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 53.3 మి.మి వర్షం కుసిరింది. ప్రాంతాల వారీగా అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారిలో 100.8 మి.మి వర్షం కురిసింది. జాఫర్‌గడ్‌లో 98, రామ్‌పూర్‌లో 95, గంగారంలో 91 ,హబ్సిపూర్‌లో 78, చిట్యాల్‌లో 74.3, కొమురవెళ్లిలో 73, గూడురులో 67,డిచ్‌పల్లిలో 64, తరిగో ప్పులలో 64 మి.మి వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News