దుబ్బాకలో టిఆర్ఎస్కు ఓటేసిన
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అహర్నిశలు కృషి చేశారు
మేం ఆశించిన ఫలితం రాలేదు
ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది, నాయకులకు హెచ్చరిక లాంటిది
ఫలితంపై త్వరలో సమీక్షించుకుంటాం
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమి సహజమని రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. విజయాలకు పొంగిపోమని,ఆపజయాలకు,ఎదురు దెబ్బలకు కుంగిపోమన్నారు. దుబ్బాక నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో కెటిఆర్ మాట్లాడుతూ గత ఆరున్నర సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్నోవిజయాలను టిఆర్ఎస్ నమోదు చేసుకుందని తెలిపారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లోనూ విజయం సాధించాము,నితర సాధ్యమైన అనేక విజయాలను టిఆర్ఎస్ నమోదు చేసిందిం. తాము ఏ ఎన్నికల్లో గెలిచినప్పుడైనా పార్టీ అధ్యక్షుడు నాయకులు పొంగిపోలేదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఓటువేసిన 62 వేల మంది పైచిలుకు ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికల్లో పార్టీ ఆదేశాల అహర్నిషలు పనిచేసిన మంత్రి హరీశ్రావు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ శ్రేణులందరికీ కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం టిఆర్ఎస్ శ్రేణులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. అయితే గెలుపు ఓటమి అనేది ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పు అన్నారు.
దుబ్బాకలో తాము ఆశించిన ఫలితం రాలేదు
దుబ్బాక ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ శ్రేణులు నిరంతరం శ్రమించినప్పటికీ తాము ఆశించిన ఫలితం రాలేదని కెటిఆర్ చెప్పారు. రాజకీయాల్లో పోటీ చేసిన వారంతా గెలుపు కోసమే ప్రయత్నిస్తుంటారని కెటిఆర్ చెప్పారు.టిఆర్ఎస్ నమోదు చేసిన విజయాలు,సాధించిన మెజారిటీ రికార్డులు ఎన్నో ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితం రాలేదన్నారు. ఈ ఎన్నిక పార్టీని, తమను అప్రమత్తం చేసిందని,మా నాయకులకు ఒక హెచ్చరికలా ఈ ఓటమి భావిస్తామని కెటిఆర్ చెప్పారు. మేము మరింత అప్రమత్తం కావడానికి దుబ్బాక ఎన్నిక తోడ్పడుతుందన్నారు.
సమీక్ష చేస్తాం
ప్రజాసక్షేమకార్యక్రమాలు పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ, రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ దుబ్బాకలో ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని కెటిఆర్ చెప్పారు. మరింత విస్తృతంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పరాజయంతో కుంగిపోకుండా సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతామని కెటిఆర్ చెప్పారు.త్వరలో దుబ్బాక ఎన్నికల ఫలితాలపై లోతైన అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు కెటిఆర్ తెలిపారు. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.