హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ 158కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఒఆర్ఆర్పై గ్రీనరీ, 28 నర్సరీలు, 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను హెచ్ఎండిఎలోని పట్టణ అడవి (అర్భన్ ఫారెస్ట్రి) విభాగం అభివృద్ది చేస్తోంది. మొక్కలకు నీటిని అందించడం కోసం 136 వాటర్ ట్యాంకర్లకు పోలీసు అధికారులు ఇచ్చిన వెహికిల్ పాస్ల ద్వారా నీళ్లు పెడుతున్నారు. అదేవిధంగా సర్వీస్ రోడ్ల వెంబడి ఉన్న ప్లాంటేషన్, రైల్వే కారిడార్, ఒపెన్ స్పేస్ లలో ఉన్న మొక్కలకు నీళ్లు అందిస్తూ వేసవిలో మొక్కలు వాడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఒఆర్ఆర్ వెంబడి ఉండే గ్రామాలకు చెందిన కార్మికులతోనే వాటరింగ్ ప్రక్రియ జరుగుతుందనీ హెచ్ఎండిఎ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన వెల్లడించారు.