Sunday, April 28, 2024

సమాంతర రిజర్వేషన్ల అమలులో వివాదాలు

- Advertisement -
- Advertisement -

రాజేష్ కుమార్ దారియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నామని టిఎస్‌పిఎస్‌సి, గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జిఒ నంబర్ 35, 3 లను విడుదల చేసింది. అందులో కేవలం మహిళలకు మాత్రమే హారిజాంటల్ రిజర్వేషన్లు వర్తింపచేస్తామని పేర్కొన్నది. ఇదిలా ఉండగా హారిజాంటల్ తీర్పుగా భావించే రాజేష్ కుమార్ దారియ కేసును ఆధారం చేసుకుని ఆ తర్వాత వచ్చిన మరికొన్ని కేసులలో వచ్చిన తీర్పులను క్రోడీకరించి సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 22, 22ఎ లను సవరిస్తూ గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిఒ నంబర్ 77ను తీసుకు వచ్చింది. దాని ద్వారా మహిళలకే కాకుండా దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్ మెన్‌లకు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకు వచ్చిన సర్వీస్ సబార్డినేట్ రూల్స్‌నే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ,

ఇటు తెలంగాణలోనూ అమలు చేయబడుతున్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు ఆ రూల్స్‌ను సవరణ చేసిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్‌ను అమలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జిఒలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జిఒలతో విభేదిస్తున్నాయి.తె లంగాణ ప్రభుత్వం మహిళలకు మాత్రమే హారిజాంటల్ రిజర్వేషన్‌ను వర్తింపచేస్తామని తెలుపుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళలతో పాటు మిగతా కొన్ని వర్గాలకు కూడా హారిజాంటల్ రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. దీంతో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు విషయం లో విభిన్నత చోటు చేసుకోవడంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చినట్లయింది. ఇదిలా ఉండగా కొందరు రాజకీయ ప్రయోజనాల కొరకు హారిజాంటల్ రిజర్వేషన్‌కు వక్ర భాష్యం పలుకుతున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పులకే సరికొత్త నిర్వచనాలను ఇస్తున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అబ్కారి శాఖ, వైద్య ఆరోగ్యశాఖలోనూ మహిళలను హారిజాంటల్ విధానంలోనే భర్తీచేశారు. అంతేకాకుండా పోలీస్ రిక్రూట్‌మెంట్‌లోనూ ఎప్పటి నుండో మహిళలకు హారిజాంటల్ విధానాన్నే పాటిస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు టిఎస్‌పిఎస్‌సి, గురుకుల బోర్డులు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించిన వెంటనే

ఓ బిఆర్‌ఎస్ మహిళా నేత మహిళలకు వర్టికల్ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేయడం శోచనీయమని పలువులు న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వివక్ష, తరతరాలుగా అణచివేతకు గురై సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను ఆర్టికల్ 15(4), 16(4)ల ప్రకారం వర్టికల్ (నిలువు)గా అమలు చేస్తుండగా, సరైన ప్రాతినిధ్యం లేదనే ఉద్దేశంతో రూపొందించబడ్డ ప్రత్యేక రిజర్వేషన్లను హారిజాంటల్ (సమాంతరం)గా అమలు చేస్తున్నారు. అంటే ఇంత వరకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు మాత్రమే నిలువు రిజర్వేషన్లను వర్తింపజేస్తుండగా మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, స్పోర్ట్ కోటాలకు సమాంతర రిజర్వేషన్లను వర్తింప చేస్తున్నారు. అయితే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఇడబ్ల్యుఎస్ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త రిజర్వేషన్లకు తెరలేపింది. దీనిపై పలు కేసులు నమోదు కాగా, సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌ను సమర్థిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల మైలురాయిగా పిలువబడే ఇంద్ర సాహ్నీ కేసులో రిజర్వేషన్లు 50% దాటకూడదని తీర్పు ఉంది. సామాజిక వివక్షకు నోచుకోనప్పటికీ అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని భావించి వారికి మాత్రమే

ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తుండడం వల్ల వీటిని ప్రత్యేక రిజర్వేషన్లుగా పరిగణించాలని కొందరు వాదిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌ను హారిజాంటల్‌గా అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అగ్రవర్ణాల్లోని పేదల శాతాన్ని లెక్కించకుండా ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల వాటాను పేర్కొనడాన్ని తప్పుపడుతూ మరికొందరు కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. రాజేష్ కుమార్ దారియా కేసులో ఇచ్చిన తీర్పు మేరకు మహిళలతో పాటు దివ్యాంగులు, స్పోర్ట్ మెన్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలను కూడా సమాంతరంగా భర్తీ చేయడంతో పాటు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అనేది సామాజిక రిజర్వేషనా? ప్రత్యేక రిజర్వేషనా? అనే విషయాన్ని తేల్చుటకు కోర్టులు ప్రత్యేక చొరవ తీసుకొని వేగవంతంగా లోతైన విచారణ జరపవలసిన ఆవశ్యకత ఉన్నదని పలువురు సామాజిక వేత్తలు, న్యాయ నిపుణులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News