Saturday, April 27, 2024

మొండి బకాయిల్లో ఎవరివి ఎంత!

- Advertisement -
- Advertisement -

భారత దేశ వ్యవస్థలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. ఆ వ్యవస్థల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. భారత దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ బడా పరిశ్రమదారులకు, భూస్వాములకు, కార్పొరేట్ సంస్థలకు రూ. లక్షల కోట్ల్లలో రుణాలు అందచేస్తున్నాయి. వ్యవసాయదారులైన రైతులకు మాత్రం నామమాత్రపు రుణాలు ఇచ్చేందుకు కూడా అనేక ఆంక్షలు, షరతులు పెడుతున్నాయి. వడ్డీ వసూల్లో కూడా బడా పారిశ్రామికవేత్తలు, రైతుల మధ్య వ్యత్యాసం కొనసాగుతున్నాయి.

రుణాల రికవరీలోనూ ఆ వ్యత్యాసం, వివక్ష కొనసాగుతున్నది. గత పది సంవత్సరాలపైగా బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరుగుతూ ఉన్నాయి. అందుకు కారణమైన బడా పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్లను వదలిపెట్టి, ఆరుగాలం పొలంలో చెమట బిందువులు చిందించి దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతాంగమే మొండి బకాయిలు పెరగటానికీ కారణంగా కొందరు ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దుర్మార్గమైన, నీచాతి నీచమైన ప్రచారం. మొండి బకాయిల్లో కార్పొరేట్ల, రైతుల రుణాలు పరిశీలిస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వాలు బడా పారిశ్రామిక వేత్తల, కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడుతున్న తీరు వెల్లడవుతున్నది.

బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకమైన అంశం తిరిగిరాని అప్పులు (నాన్ పెర్పార్మింగ్ అసెట్స్ ఎన్‌పిఎ). బ్యాంకులు జారీ చేసిన రుణాలకు సంబంధించిన ఒక వర్గీకరణ ఇలా పేర్కొంది. రుణాలు తీసుకున్న వారు డిఫాల్ట్ అవటం లేదా సమయానుకూలంగా చెల్లింపులు జరపడంలో విఫలమైతే అలాంటి వాటిని ఎన్ పిఎలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఈ చెల్లింపులు కొంత నిర్దిష్ట కాలం పాటు జరగకపోతే వాటిని ఎన్‌పిఎలుగా పేర్కొంటారు. అనేక విమర్శల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కూడా మొండి బకాయిల వివరాలు వెల్లడించక తప్పలేదు. ఒక ప్రశ్నకు సమాధానంగా గత ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకు ల్లో మొండి బకాయిలు రూ. 10,09,511 కోట్లు ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 13- డిసెంబర్ -22న పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మొండి బకాయిలన్నీ పెద్ద పారిశ్రామిక వేత్తల, కార్పొరేట్ల కంపెనీలవే కావటం గమనించాల్సిన అంశం.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఒక్కో బ్యాంకు వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు, పారిశ్రామికవేత్తలు ఎగనామం పెట్టిన అప్పులు ఎన్ని ఉన్నాయి అంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి రిజర్వు బ్యాంక్‌కు సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. అందుకు స్టేట్ బ్యాంక్ 16 డిసెంబర్ -22న సమాధానం ఇస్తూ రూ. 1,71,953 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయలేకపోతున్నామని, వీటికి తోడు పారిశ్రామికవేత్తల మొండి బకాయిలు రూ. 1,06,804 కోట్లుగా ఉందని, ఇది ఇంకా తిరిగి రాలేదని ఆ బ్యాంక్ పిఐఒ ములుకుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. ఒక్క బ్యాంక్‌లోనే మొండి బకాయిలు ఇన్ని కోట్లు ఉంటే మొత్తం బ్యాంకుల మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉంటాయో ఊహించవచ్చు.

లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్న బడా పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ల గురించి మాట్లాడకుండా, బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు రైతుల మొండి బకాయిలు కారణమని అధికారులు చెప్పటం వాస్తవాలను మరుగుపర్చటమే. 2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,400 కోట్ల రైతుల మొండి బకాయిలు ఉన్నాయని, అవి ఇప్పుడు రూ. 60 వేల కోట్లకు చేరుకున్నాయని బ్యాంకు అధికారులు లెక్కల చెబుతున్నారు. అందుకు కారణం కూడా అధికారులే చెప్పారు. అతివృష్టి, అనావృష్టిల వలన పంటలు నష్టపోయారని, అంతే కాకుండా పంట ఖర్చులు పెరిగాయని దాని ఫలితంగా వ్యవసాయ రంగం లో మొండి బకాయిలు పెరుగుదలకు కారణమన్న వాస్తవాన్ని బ్యాంకులు తెలియ చేశాయి. ఈ పెరిగిన మొండి బకాయిల్లో కూడా చిన్న, సన్నకారు రైతులు చాలా తక్కువ. వ్యవసాయ రుణాల పేరుతో భూస్వాములు, కోల్డ్ స్టోరేజీ యజమానులు, సంపన్న వర్గాలు రుణాలే మొండి బాకీలుగా 90% పైగా ఉన్నాయి. రైతులు ఎప్పుడు తీసుకున్నా అప్పు ఎగ్గొట్టే ఆలోచన చేయరు. తలతాకట్టు పెట్టైనా అప్పు తీరుస్తారు.పంటలు నష్టపోయి, అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలే పరిష్కారమని భావిస్తున్న పరిస్థితుల్లో, బ్యాంకుల అప్పులు కట్టడం ఆలస్యం అయితే వారిని ఎగవేత దారులుగా ముద్రవేయటం నీచమైనదే కాక, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయటమే.

అహ్మదాబాద్‌లో జరిగిన 173వ ఎస్‌ఎల్‌బిసి ( రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) లో సమర్పించిన తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రంగాల్లో నిరర్ధక ఆస్తులు 2021లో రూ. 5,696 కోట్లు. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,572 కోట్లుగా ఉన్నాయి. రుణాల చెల్లింపులో కార్పొరేట్లతో పోలిస్తే రైతులు చాలా మెరుగ్గా ఉన్నారని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది కార్పొరేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ. 1.46 కోట్లు. ఈ కార్పొరేట్ల పేర్లు కూడా చెప్పరు. అప్పులపాలై రుణాలు చెల్లించలేకపోయిన రైతులకు మాత్రం అరెస్టు వారెంట్లు జారీ చేస్తున్నారు. అలా పంజాబ్‌లో రెండు వేల మంది రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేశారు. పంజాబ్‌లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు మాత్రమే. బకాయిలు చెల్లించని రైతుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తున్న బ్యాంకు అధికారులు కార్పొరేట్ సంస్థల ముందు ఎందుకు చేయటం లేదు? గుజరాత్‌లో ఒక రైతు 31 పైసలు చెల్లించలేదని ఎస్‌బిఐ నో డ్యూ సర్టిపికెట్ ఇవ్వలేదు. ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఎవరికీ తెలియకుండా 2020- 21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.02 లక్షల కోట్ల మేరకు వారు చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేశాయి.

2021 -22 ఆర్థిక సంవత్సరంలోని ఆరు నెలల్లో వరుసగా బ్యాంకులు రూ. 46,382 కోట్ల్లు, రూ. 39 వేల కోట్లు మొండి బకాయిలు రద్దు చేశాయి. రెండు సెక్షన్ల బ్యాంక్ రుణాల ఎగవేతకు రెండు రకాల నిబంధనలు ఉన్నాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ ‘45 ఇ’ ని ఉపయోగించి కార్పొరేట్ డిఫాల్టర్ల గుర్తింపును బహిర్గతం చేయటానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ తిరస్కరిస్తుంది. దీనికి గోప్యత కారణం అంటున్నారు. న్యాయస్థానాలు ఆదేశించటంతో కొంత మంది పేర్లు బయటపెట్టారు. వారిలో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరజ్ మోడీ లాంటి వారు ఉన్నారు. కార్పొరేట్ సంస్థల బకాయిల్లో బ్యాంకులు 10 శాతం కూడా వసూలు చేయలేదని పలు ఆర్‌బిఐ ఆధారిత నివేదికలు తెలుపుతున్నాయి. బ్యాంకుల మరొక పాలసీ నిర్ణయం స్పష్టమైన వివక్షను ఎత్తి చూపుతున్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల పంటలను మద్దతు ధరలకు కొనుగోలుచేసిన తర్వాత చెల్లించాల్సిన డబ్బులో కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చిన రుణాన్ని మినహాయించి చెల్లిస్తున్నారు. ఇది రైతును తొక్కిపడవేయటమే.

కాని పరిశ్రమల అధి పతులకు తాజాగా రుణాలు మంజూరు చేసేటప్పుడు వారి నిరర్ధక రుణాల మొత్తాన్ని బ్యాంకులు ఎందుకు తీసుకోవటం లేదు. ఇది వివక్ష కాదా! నిరర్ధక రుణాలను రికవరీ చేసే ఒక సాధనమైన ఐబిసి ప్రొసీడింగ్స్ ప్రకారం పరిశ్రమాధిపతుల్లో సగటున 65 నుంచి 95% మంది నిరర్ధక ఆస్తులు కలిగి ఉన్నారు. అయినా వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. అదే విధంగా రైతులకు తిరిగి రుణాలు ఇచ్చి రైతుల సేద్యానికి ఎందుకు తోడ్పటంలేదు. రైతులపట్ల వివక్ష ఎందుకు చూపుతున్నారు. రుణాల ఎగవేతను బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే, పంటలు కోల్పోయి అప్పులపాలైన రైతులు రుణాలు చెల్లించలేకపోవటంలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు చెల్లించాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను బ్యాంకులు, ప్రభుత్వం వసూలు చేయగలిగితే రైతాంగం చెల్లించాల్సిన రుణాలు రద్దు చేసినా బ్యాంకుల ఎటువంటి సమస్య ఉండదు.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News