Sunday, April 28, 2024

నన్ను చంపేయాలని కుట్ర: ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : కస్టడీలో తనకు నరకం చూపారని, చివరికి తన గుండెను దెబ్బతీసే విధంగా ఓ రకం ఇంజెక్షన్ ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఒక్కరోజు క్రితం పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ను అవినీతి అభియోగాలపై సైన్యం జబర్దస్తీగా అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లింది. మరుసటి రోజు బుధవారం ఆయనను స్థానిక కోర్టులో హాజరుపర్చారు. తమ కస్టడీకి ఇమ్రాన్‌ఖాన్‌ను పదిరోజుల పాటు అప్పగించాలని నేషనల్ అకౌంటిబుల్టి సంస్థ కోర్టును కోరింది. దీనికి కోర్టు సమ్మతించడంతో ఆయన మరో పదిరోజులు నిర్బంధంలో ఉండాల్సి వస్తుంది. కోర్టులో ఇమ్రాన్‌ఖాన్ న్యాయమూర్తి ఎదుట సైన్యంపై పలు ఆరోపణలు చేశారు. ఓ సైనికాధికారి తనను చంపించేందుకు పలు రకాలుగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాను కస్టడీలో పలు రకాల చిత్రహింసలకు గురి అయినట్లు వివరించారు.

సైన్యం తనను హైకోర్టులోనే బయటకు ఈడ్చుకువెళ్లిందని, ఈ క్రమంలో తనను కొట్టారని వివరించారు. చివరికి తను వాష్‌రూం వెళ్లేందుకు కూడా అనుమతించలేదన్నారు. తన గుండె కొట్టుకోవడం తగ్గేలా చేసే ఇంజిక్షన్ ఇచ్చారని, దీని ప్రభావం ఇప్పటికీ ఉందన్నారు. ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌పై స్థానిక కోర్టు ఈ నెల 17న విచారణ జరుపుతుంది. మరో వైపు పాకిస్థాన్ అంతటా ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. పలు ప్రాంతాలలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనేక చోట్ల ఆస్తుల విధ్వంసం జరిగింది. విదేశీయులు ప్రాణభయంతో ఉన్నారు. బూటకపు కేసులు పెట్టి ఈ సైనిక వర్గాలు తను తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని సంకల్పించాయని, తాను జైలులోనే మగ్గాలనేదే వారి ప్రయత్నం అన్నారు. గత ఏడాది ఎప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు అయ్యారు. అప్పటి నుంచి ఆయన అసాధారణ రీతిలో సైన్యానికి వ్యతిరేకంగా తమ నిరసనను సందిస్తూ వస్తున్నారు. ఈ దశలోనే అవినీతి అభియోగాలతో ఆయన అరెస్టు జరిగింది. అల్ ఖాదీర్ ట్రస్టు కేసులో ఆయనను అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పిటిషన్
ఇమ్రాన్‌ఖాన్ అరెస్టును సమర్థిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు వెలువరించిన రూలింగ్‌ను సవాలు చేస్తూ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ బుధవారం దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును కొట్టివేయాలని పార్టీ అభ్యర్థించింది. పార్టీ తరఫున బారిస్టర్ అలీ జాఫర్ , పిటిఐ నేత ఫవాద్ చౌదరీలు కేసు వేశారని డాన్ న్యూస్ పత్రిక తెలిపింది. పార్టీ ఏడుగురు సభ్యుల కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పరిస్థితిని సమీక్షించుకుని, తదుపరి చర్యల గురించి విశ్లేషించుకుంది. పార్టీ అధినేతను భద్రంగా త్వరగా బయటకు తీసుకువచ్చే చర్యలను చేపట్టాలని సంకల్పించారు.

పార్టీ ఉపాధ్యక్షులు షా మెహమ్మద్ ఖురేషీ కమిటీ సభ్యులైన ఎంపిలు సైఫుల్లా ఖాన్ న్యాజీ, అజామ్ స్వాతి , ఇజాజ్ చౌదరి ఇతరులతో మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఫాసిస్టు చర్య అని, ఆయన విడుదల చట్టబద్ధతతో కూడిన అంశం అని పార్టీ నేతలు తెలిపారు. మరో వైపు దేశంలో నిరసనలను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్‌లోని పంజాబ్, బెలూచిస్థాన్ ఇతర ముఖ్య ప్రాంతాలలో సెక్షన్ 144 విధించారు. పలు ప్రాంతాలలో సైనిక గస్తీ సాగుతోంది. అయినప్పటికీ బుధవారం పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. లాహోర్, రావల్సిండి, పెషావర్, క్వెట్టా, కరాచీలలో విధ్వంస ఘటనలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News