గౌహతి- చెన్నై బడ్జెట్ క్యారియర్ ఇండియా ఫ్లైట్ బెంగళూరు లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తగినంత ఇంధనం లేకపోయిన కారణంగా పైలెట్లు మేడే ప్రకటించిన తర్వాత 168 మంది ప్రయాణికులతో విమానం బెంగళూరులో ల్యాండ్ అయినట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. గురువారం ఈ సంఘటన జరిగింది. లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన కొద్ది నిముషాలలోనే కుప్పకూలిన వారం రోజుల తర్వాత ఈ సంఘటన జరగడం ఆందోళన కల్గించింది.చెన్నై విమానాశ్రయంలో విమానాల రద్దీ కారణంగా ఇండిగో విమానం సకాలంలో అక్కడ దిగలేక పోయింది.
దీంతో ఈ విమానాన్ని బెంగళూరు వైపు మళ్లించడం జరిగిందని విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం 4-40 గంటలకు గౌహతి నుంచి బయలుదేరిన 6ఇ-6764 ఇండిగో(ఏ321) విమానం పైలెట్ చెన్నైలో ల్యాండ్అయ్యేందుకు 7,45 నిముషాల ప్రాంతంలో ప్రయత్నించాడు. అయితే విమానం దిగేందుకు అనుమతి లభించక పోవడంతో చుట్టూ తిరగాలని నిర్ణయించుకున్నాడు. ఇంధనం తక్కువగా ఉండడంతో ప్రమాదాన్ని సూచిస్తూ, మేడే కాల్ రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే మెడికల్, అగ్నిమాపక దళం సిబ్బందిని సిద్ధంచేశారు. రాత్రి 8-20 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
శుక్రవారం మదురై వెళ్తున్న ఇండిగో విమానం గాలిలో ఎగురుతుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నైకి తిరిగి వెళ్ళి ల్యాండ్ కావడానికి అనుమతి కోరినట్లు వర్గాలు తెలిపాయి. 68 మంది ప్రయాణికులతో కూడిన విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రయాణికులందరినీ దింపివేశారు.