Sunday, April 28, 2024

ఔటర్ బయట పారిశ్రామిక వాడలు

- Advertisement -
- Advertisement -

భూములను గుర్తించాలని అధికారులకు సిఎం ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్ బయట, రీజినల్ రింగ్ రోడ్ లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, ఈ భూములు రాష్ట్ర రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ పరిశ్రమల కోసం సేకరించే భూములు, బంజరు భూములై ఉండాలని, సాగుకు యోగ్యంకానివిగా ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు నష్టం కలుగకుండా ఉంటుందని, కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేవిధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు కాకుండా ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారని ఆభూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ నిరుపయోగ బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని అన్నారు. పరిశ్రమలకు ధర్మల్ విధ్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈసందర్భంగా బాలానగర్ లోని ఐడిపిఎల్ భూముల పరిస్థితిపై సిఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సిఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా-నవాజ్ ఖాసీం తదితరులు హాజరయ్యారు.

Review 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News