Thursday, May 2, 2024

కనువిందు చేయనున్న ఐపిఎల్!

- Advertisement -
- Advertisement -

IPL 15 started from March
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్ అభిమానులను కనువిందు చేయనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఐపిఎల్ టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. ఈసారి మాత్రం అభిమానుల సమక్షంలో టోర్నీ జరుగనుంది. అంతేగాక గతంలో యుఎఇలో జరిగిన ఐపిఎల్ ఈసారి సొంత గడ్డపైనే నిర్వహిస్తున్నారు. ముంబైలోని మూడు వేదికలతో పాటు పుణె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఇక ఈసారి ఐపిఎల్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 8 జట్లే పోటీ పడగా ఈసారి టీమ్‌ల సంఖ్య పదికి చేరింది. అంతేగాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపిఎల్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లను ఆడనుంది. మార్చి 26న ప్రారంభమయ్యే ఐపిఎల్ మెగా సీజన్‌కు మే 29న జరిగే ఫైనల్‌తో తెరపడుతుంది. ఈసారి లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరుగుతాయి. అంతేగాక మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తారు. ముంబైలోని వాంఖడే, డివై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తారు. పుణె ఎంసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 15, బ్రాబోర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు నిర్వహించాలని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు.

సత్తా చాటేందుకు సిద్ధం..

IPL mega auction on February 7,8?

మరోవైపు సుదీర్ఘ రోజుల పాటు సాగే ఐపిఎల్ కోట్లాది మంది అభిమానులను కనువిందు చేయడం ఖాయమనే చెప్పాలి. ఈసారి పది జట్లు తలపడుతుండడంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారింది. భారత్‌తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇటీవల జరిగిన ఐపిఎల్ మెగా వేలం పాటలో భారత్‌తో పాటు పలువురు విదేశీ క్రికెటర్లు కోట్లాది రూపాయల ధరకు అమ్ముడు పోయారు. పది ఫ్రాంచైజీలు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక ఐపిఎల్‌లో అదృష్టం వరించిన క్రికెటర్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణ, లియమ్ లివింగ్‌స్టోన్, హసరంగా, హర్షల్ పటేల్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్ వంటి క్రికెటర్లపై ఆయా ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు గుమ్మరించాయి. దీంతో వీరి ఆట ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేగాక సీనియర్లు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, షమి, బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, జడేజా, రాయుడు, దినేశ్ కార్తీక్ తదితరులు ఎలా ఆడతారనేది కూడా టోర్నీకి ఆసక్తికరంగా తయారైంది. మొత్తం మీద ఈసారి ఐపిఎల్ టోర్నీ అభిమానులను అలరించడం మాత్రం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News