మోసుల్ : ఇరాన్ ఇరాక్ ఉద్రిక్తతల సందట్లోసడేమియాగా ఇరాక్ బలగాలు అతి భారీ ఐసిస్ ఉగ్రవాదిని పట్టుకున్నాయి. ఇది తమ వలలో పడ్డ అతి పెద్ద చేప అని ఇరాక్ ప్రత్యేక దళం స్వాట్ సగర్వంగా ప్రకటించింది. జబ్బా ది జిహాదీగా బహుళ ప్రచారం పొందిన ఈ స్థూలకాయ ఉగ్రవాది బరువు అంతా ఇంతా కాదు. ఏకంగా 250 కిలోలు. పౌండ్లలో అయితే 560 పౌండ్లు. ఐసిస్ కార్యకలాపాల వ్యూహరచన, వాటి అమలులో దిట్టగా మారిన జబ్బా అనబడే ఈ వ్యక్తి అసలు పేరు ముఫ్టీ అబూ అబ్దుల్ బారీ. ఇరాక్ బలగాలను గడగడలాడించిన ఈ గట్టిపిండం మోసుల్ నగరంలో ఒక హోటల్లో ఉన్నాడని నిఘావర్గాలు ఉప్పందించడంతో స్వాట్ దళాలు మెరుపుదాడికి దిగాయి.
అక్కడ ఐసిస్ ప్రచారకుడిని చూసి సైనిక దళాలు కంగుతిన్నాయి. గున్న ఏనుగును పోలిసన ఈ భారీకాయుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లేందుకు వారు తెచ్చిన జీపు ఇతర చిన్న వాహనాలు సరిపోవని నిర్థారించుకుని, ఒక పెద్ద ట్రక్కును తీసుకువచ్చి , అందులోకి అతి కష్టం మీద చేర్చారు. పైగా కూర్చోబెట్టడం సాధ్యం కాకపోవడంతో ట్రక్కులో ఒక పడక ఏర్పాటు చేసి, దానిపై పవళింపచేసి తీసుకువెళ్లారు. ఈ ఐసిస్ ప్రచారకుడు తమకు నానా కష్టాలు పాలు చేశాడని, ముష్కరుడుగా ఇంతకాలం తప్పించుకు తిరిగాడని, ఇప్పుడు వలేసి పట్టుకున్న తరువాత కూడా నానా ఇక్కట్లకు గురి చేశాడని, ఈ బరువు మోయడం కష్టం అని దళం వారు నిట్టూర్చారు. ఐసిస్ పట్ల సానుకూలత వ్యక్తం చేయని మతపెద్దలను చంపివేయాలని తరచూ ఫత్వాలకు దిగుతూ వచ్చిన ఈ ఆసామీని ఇప్పుడు అతి భారీ సైజు ఏకాంత నిర్బంధ స్థలికి తీసుకువెళ్లారు.