Sunday, April 28, 2024

అమెరికా ప్రతీకార దాడిలో కీలక కమాండర్ మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఇరాక్ లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కీలక కమాండర్ హతమైనట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ మద్దతు ఉన్న కతైబ్ హెచ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ కమాండర్ అబూ బకర్ అల్ సాదిని మట్టు బెట్టినట్టు తెలియజేసింది. జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారం గానే తాము ఈ దాడి చేశామని వివరించింది. మధ్య ప్రాచ్యంలోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతడి హస్తం ఉందని తెలియజేసింది.

బాగ్దాద్‌లో కారులో వెళ్తున్న కమాండర్‌ను లక్షంగా చేసుకుని దాడి చేసినట్టు అమెరికా సైనికాధికారి తెలిపారు. ఈ ఘటనలో పౌరులు మరణించిన దాఖలాలు లేవని చెప్పారు. కారు మాత్రమే దగ్ధమైనట్టు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని కూడా ఇదే విధంగా హతమార్చడమైంది. ఇరాన్ మద్దతు ఉన్న కతైబ్ హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ మరికొన్ని సంస్థలతో కలిసి మధ్య ప్రాచ్యం లోని తమ సైనిక స్థావరాలను లక్షంగా చేసుకుందని అమెరికా తెలిపింది.

అందులో భాగంగా ఇటీవల జోర్డాన్‌లో దాడి జరిగినట్టు గుర్తు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాక్, సిరాయల్లో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్ గ్రూపులపై దాడులు చేస్తున్నట్టు అమెరికా వివరించింది. ఇదిలా ఉండగా మరోవైపు అబూ బకర్ అల్ సాదీని హతమార్చడం నిప్పుతో చెలగాటమేనని ఆ గ్రూప్ నాయకుడు ఫలేహ్ అల్ ఫయ్యద్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా దళాలు సిరియాలో జరిపిన దాడుల్లో ఇరాన్‌కు మద్దతుగా పోరాడుతున్న 29 మంది మరణించారని ఓ మానవ హక్కుల సంస్థ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News