Sunday, April 28, 2024

ఖుర్దిష్ మిలిటెంట్ల స్థావరాలపై టర్కీ వైమానిక దాడులు

- Advertisement -
- Advertisement -

ఇస్తాంబుల్: ఇరాన్, సిరియాలలోని ఖుర్దిష్ మిలిటెంట్ల స్థావరాలను లక్షంగా చేసుకుని టర్కీ శనివారం వైమానిక దాడులు జరిపింది. శుక్రవారం ఇరాక్‌లోని టర్కీ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో తొమ్మిది మంది టర్కీ సైనికులు మరణించిన తర్వాత టర్కీ ఈ దాడులు చేసింది. ఉత్తర ఇరాక్‌లోని మెతినా, హకుర్క్, గారా, క్వాండిల్ ప్రాంతాల్లోని టార్గెట్లపై వైమానిక దాడులు జరిగినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే సిరియాలోని ఏ ప్రాంతాలపై దాడి జరిగిందో మాత్రం స్పష్టం చేయలేదు. ‘మా ప్రజలు, భద్రతా దళలపై ఉగ్రదాడులు జరిపిన వారిని మట్టుబెట్టేందుకు, మా సరిహద్దు భద్రతను కాపాడుకోవడం కోసం యుద్ధ విమానాలు గుహలు, బంకర్లు, షెల్టర్లు, చమురు కేంద్రాలను నాశనం చేశాయి. ఈదాడుల్లో చాలా మంది మిలిటెంపట్ల అంతమయ్యారు’ అని టర్కీ రక్షణ శాక ఆ ప్రకటనలో తెలిపింది.

శుక్రవారం రాత్రి ఉత్తర ఇరాక్‌లోని సెమీ అటానమస్ ఖుర్దిష్ ప్రాంతంలోని ఒక మిలిటరీ స్థావరంలోకి చొరబడడానికి కొందరు సాయుధ దుండగులు ప్రయత్నించారు. ఈ దాడిలో అయిదుగురు సైనికులు అక్కడిక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆస్పత్రిలో మృతి చెందారు. 15 మంది మిలిటెంట్లు హతమయినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ దాడులపై ఖుర్దిష్ ప్రభుత్వం, ఇరాక్ ప్రభుత్వం, లేదా ఇరాక్‌లోని సెమీ అటానమస్ ప్రాంతంలోని ప్రభుత్వం గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ శనివారం భద్రతా సమావేశం నిర్వహించనున్నట్లు టర్కీ అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎక్స్‌లో ఒక ట్వీట్‌లో తెలిపారు. మూడు వారాల క్రితం ఖుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ(పికెకె)కి అనుబంధంగా ఉన్న మిలిటెంట్లు ఉత్తర ఇరాక్‌లోని ఒక టర్కీ ఆర్మీ బేస్‌లోకి చొరబడడానికి ప్రయత్నించారు.

ఈ దాడిలో ఆరుగురు టర్కీ సైనికులు చనిపోయారు. ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు టర్కీ సైనికులు మృతి చెందారు. దీనికి ప్రతిగా టర్కీ ఇరాక్, సిరియాలలో పికెకెకు అనుబంధంగా ఉన్న స్థావరాలపై దాడులు జరిపింది. ఆ దాడుల్లో డజన్ల సంఖ్యలో ఖుర్దిష్ మిలిటెంట్లు చనిపోయినట్లు టర్కీ రక్షణ మంత్రియాసర్ గులెర్ అప్పట్లో చెప్పారు. ఉత్తర ఇరాక్‌లో బేస్‌లు నిర్వహిస్తున్న పికెకెను టర్కీ, అమెరికాతో పాటుగా దాని మిత్ర దేశాలు ఉగ్రవాద సంస్థగా భావిస్తున్నాయి.1984లో ఘర్షణలు మొదలయినప్పటినుంచి వేలాది మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News