ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత వారం రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని గమనించిన మీదట కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. అమెరికా శిబిరపు పూర్తి మద్దతులేనట్లయితే ఇజ్రాయెల్ ఎప్పుడో ఓడి ఉండేది. తనంతట తాను ఒంటరిగా యుద్ధం చేయవలసివస్తే బహుశా అందుకు అసలు సాహసించేదే కాదు. ఈ 13వ తేదీన వారు ఇరాన్ పై దాడులు ప్రారంభించినపుడు అంతటా ఉండిన అభిప్రాయం ఏమిటి? ఇజ్రాయెల్ ఒక అజేయశక్తి. శత్రువులందరినీ తరచు ఒంటిచేత చిత్తు చేస్తున్నది. తన శక్తితోపాటు అమెరికా, యూరోపియన్ దేశాలనుంచి ఆయుధ, ఆర్థిక బలాలు అందుతున్నాయి. రాజకీయంగా ఐక్యరాజ్య సమితి మొదలు కొన్ని అన్ని వేదికలపై సమర్థన, రక్షణ లభిస్తున్నాయి. అందుకు భిన్నంగా ఇరాన్ బలహీనమైన దేశం. పశ్చిమాసియాలోని అరబ్ దేశాలేవీ వెంటలేవు. అందువల్ల వారిని ఇజ్రాయెల్ చూస్తూ చూస్తూండగానే ఓడించి లొంగదీయగలదని.
ఇపుడు జరుగుతున్న దానితో యావత్ ప్రపంచం నివ్వెరపోతున్నది. ఇజ్రాయెల్ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతూ కేవలం నాలుగు రోజులు తిరిగే సరికి తట్టుకోలేక, యుద్ధంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోవలసిందిగా అమెరికాను అర్థించటం మొదలుపెట్టింది. అత్యద్భుత రక్షణ కవచమని ఏళ్ల తరబడి ప్రచారం చేసిన తమ ‘ఐరన్ డోమ్’ అధిక భాగం నిరర్ధకంగా మారింది. స్వయంగా తాము ఉత్పత్తి చేసే క్షిపణులకు అదనంగా అమెరికన్ శిబిరం సరఫరా చేసేవి శక్తివంతమైనవే కాగా, అంతకు తీసిపోని శక్తి గల క్షిపణులతో ఇరాన్ వరుసగా ఎదురు దాడులు సాగిస్తున్నది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో ఎంత విధ్వంసం జరుగుతున్నదో ఇరాన్ దాడులలోనూ అటువంటి విధ్వంసం విస్తారంగా కనిపిస్తున్నది.
ఆ విధంగా కూలుతున్న వాటిలో ఇజ్రాయెల్కు చెందిన సైనిక ప్రధాన కార్యాలయాలు, మొస్సాద్ కేంద్రం, రక్షణ స్ధావరాలు సైతం ఉన్నాయి. ఐరన్ డోమ్కు అవసరమైన క్షిపణుల నిల్వలు తరిగిపోతున్నాయి. ఈ దిగ్భ్రమల నుంచి తేరుకోలేని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, (Israeli Prime Minister Netanyahu)ఆయన రక్షణ మంత్రి, సైన్యాధిపతి భయకంపితులవుతున్నట్లు వారి ముఖ కవళికలు రెచ్చిపోయిన మాటలే చెప్తున్నాయి. నెతన్యాహూ యుద్ధానికి మొదట అన్నదేమిటి? ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలను ధ్వంసం చేయటం, సైనిక శక్తిని పూర్తిగా దెబ్బతీయటం, అంతింగా అక్కడి ప్రభుత్వాన్నే కూలదోసి తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఇదంతా నల్లేరుపై బండి నడకవలే చకచకా కొన్ని రోజులలోనే జరిగిపోగలదన్నది వారి అంచనా. ఆ తరహాలో యుద్ధం కోసం కొన్ని సంవత్సరాలుగా సన్నాహాలు చేస్తున్నారు.
దీనంతటికి అమెరికన్ శిబిరపు మద్దతు పూర్తిగా ఉంది. పైకి ఇరాన్తో చర్చలు అని కపటపు రాజకీయం సాగిస్తూ, తెరవెనుక మాత్రం మరొకటి చేస్తూ వచ్చారు. కాని ఇజ్రాయెల్ మూడు లక్షాలలో ఏదీ నెరవేరకపోగా, అటువంటి అవకాశం అయినా లేదని ఈ వారం రోజుల యుద్ధంలో తేలింది. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులైతే జరిపారు గాని స్వల్పంగా తప్ప నష్టం చేయలేకపోయారు. ఇరాన్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలు, నిల్వలు ఆ సువిశాల దేశాంలో అనేక చోట్ల విస్తరించి ఉన్నందున వాటి జాడలైనా పూర్తిగా తెలియటం లేదు. ముఖ్య సైన్యాధికారులు కొందరిని చంపగలిగినా, ఆ స్థానాలను వెంటనే ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ మార్పిడి అన్నది ఒక హాస్యాస్పదపు మాట. ఇరానియన్లు ఒక సుదీర్ఘమైన చరిత్ర గల గొప్ప జాతి. అంతర్గత అసంతృప్తులు కొంత ఉన్నా బయటినుంచి ముప్పు ఏర్పడటంతో వెంటనే జాతీయతా భావనలతో అంతా ఒకటయ్యారని వార్తలు సూచిస్తున్నాయి.
మరొక వైపు, ఇజ్రాయెల్ వద్ద గల ఆయుధ నిల్వల కన్న ఇరాన్ వద్ద చాలా ఎక్కువ. రెండింటికి సరిహద్దులు కలిసిలేవు గాని, ఉండి ఉంటే ఇజ్రాయెల్ కన్న కొన్ని రెట్లు ఎక్కువ సైన్యం గల ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్లోకి చొచ్చుకుపోయి ఉండేది. ఇజ్రాయెల్కు పైచేయి ఉన్నది ఒక్క వైమానిక బలంలోనే. అయితే, తమ రక్షణ వ్యవస్ధలను ఒక రోజు గడిచేసరికి క్రియాశీలం చేసిన ఇరాన్, ఎదురు దాడులతో కొన్ని విమానాలను ఇప్పటికే కూల్చివేసింది. యుద్ధ పరిస్థితి తాము అంచనా వేసినట్లు లేకపోవటంతో, ఇది ఇట్లానే కొనసాగితే ఓటమి తప్పదని అర్థ్ధమైన నెతన్యాహూ వరుసుగా ట్రంప్ను సంప్రదించటం మొదలుపెట్టారు. ఆ మీదట జరుగుతున్నదేమిటో చేస్తూనే ఉన్నాము.
యుద్ధంలో తమ ప్రమేయం ఏమాత్రం లేదని, అది తమ యుద్ధం కాదని, వారేదో చిన్నపిల్లల్లా పోట్లాడుకుంటున్నారని, పోట్లాడుకోనివ్వండని, ఇరాన్తో తమ చర్చలు కొనసాగుతాయని, తాము కోరుకునేది ఇరాన్కు అణ్వస్త్రాలు లేకపోవటం ఒక్కటేనని అంటూ వచ్చిన ట్రంప్, ఇజ్రాయెల్ ఓడుతున్న స్థితిని గమనించే సరికి ఒక్కసారిగా మాట మార్చారు. తన నటనలను వదలివేసారు. అమెరికన్ ప్రయోజనాలకోసం ఇజ్రాయెల్ను ముందుంచి యుద్ధాలు నడిపించే ఎత్తుగడ చెల్లటంలేదని అర్థ్ధం కావటంతో ఇక తప్పనిసరి అయి తానే రంగంలోకి దిగటం మొదలు పెట్టారు.ఆ విధంగా, పశ్చిమాసియా ప్రాంతంలో గల 19 సైనిక స్థావరాలను క్రియాశీలం చేసారు. సమీప సముద్రాలలోకి నౌకాబలాలను పంపుతున్నారు. ఇప్పటికే గల 40,000 సేనలకుతోడు మరిన్ని పటాలాలను బట్వాడా చేస్తున్నారు.
ఇజ్రాయెల్ దెబ్బతీయలేని అణు కేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు ప్రయోగం కోసం బి52 విమానాలు రవాణా చేస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహెరాన్ను ప్రజలు వెంటనే ఖాళీ చేయాలన్న నెతన్యాహూ హెచ్చరికలను తన అధికారుల చేత కూడా చేయిస్తున్నారు. అక్కడి అధినాయకుడు ఖొమెనెయ్ను హత మార్చగలమని నెతన్యాహూ ప్రకటించగా ఖొమెన్య్ ఎక్కడున్నదీ తెలుసునని, తనను ఎపుడు కోరుకుంటే అపుడు చంపగలమని, కాని ప్రస్తుతానికి కాదని అంటున్నారు. కెనడాలో జి7 సమావేశాల నుండి అర్ధంతరంగా వైట్హౌస్కు తిరిగి వెళ్ళి, ఏవో సన్నాహాలు ఆరంభించారు. తాను చేయబోయేది ఏమిటో ఎవరికీ తెలియదని నర్మగర్భపు హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవలసిందేనని ప్రకటిస్తున్నారు.
చివరకు ఏమి జరిగేదీ చెప్పలేము. కాని తాము ఎట్టి పరిస్థితులలో లొంగే ప్రసక్తి లేదని ఇరాన్ అధినేత వెంటనే స్పష్టం చేసారు. ఈ విధమైన వారం రోజుల పరిణామాలతో కనిపిస్తున్నదేమిటి? ఒకటి, ఇజ్రాయెల్ తనంతట తానుగా, అమెరికా మద్దతు ఉండి కూడా, గెలవగల పరిస్థితి లేదు. మరెవరి తోడ్పాటు లేకుండా ఇరాన్ ఒక్కటే వారిని ఓడించగలదు. అమెరికాన్ కూటమికి పశ్చిమాసియాలో గల ప్రయోజనాలకు రక్షణ లభించాలంటే, అందుకోసం అక్కడ మొదటినుంచి ఏజెంట్గా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ను ఓడకుండా నిలబెట్టాలి. తమ సహాయంతో ఇజ్రాయెల్ తనంతట తాను నిలబడలేని పరిస్థితి ఎదురైతే, తాము స్వయంగా సైనిక జోక్యం చేసుకోవాలి. ఇరాన్ అణు పరిశోధనలన్న మాట కేవలం సాకు. ఆ మాట వారికి కూడా తెలుసు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించటం తప్ప ఆయుధాల తయారీకి తాము వ్యతిరేకమని ఇరాన్ మొదటినుంచి పదే పదే ప్రకటిస్తున్నది.
అణుశక్తి కేంద్రాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలున్నాయి. అయినప్పటికీ అమెరికా తదితర దేశాలతో అదనపు ఒప్పందం గతంలో చేసుకోగా, దానినుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. ఇపుడు తిరిగి ఒప్పందానికి ట్రంప్ ప్రభుత్వంతో అయిదు విడతలు చర్చలు జరిగాయి. ఆరవ విడత సమావేశం ఈ నెల 15న జరగనుండగా, ఆకస్మికంగా 13న ఇజ్రాయెల దాడులు మొదలయ్యాయి. ఇరాన్ అణ్వస్త్ర ఉత్పత్తి చేయటం లేదని, అందుకు కావలసిన 90 శాతం యురేనియం శుద్ధికి చాలా దూరంలో 60 శాతం మేరకే ఉన్నారని అణుశక్తి సంస్థతోపాటు స్వయంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇటీవలే నివేదిక కూడా ఇచ్చాయి. అయినప్పటికీ ట్రంప్, కెనడా నుంచి తిరిగి వస్తూ ఆ నివేదికను తాను లెక్కచేయబోనని, అణ్వాయుధాన్ని త్వరలో తయారు చేయబోతున్నారంటూ మాట్లాడారు.
దీనిని బట్టి, అమెరికా సామ్రాజ్యవాదపు తీరు తెన్నులు ఏమిటో ఇంకా వివరించనక్కరలేదు. పశ్చిమాసియాలో గల పాలస్తీనాను 1948 లో బలవంతంగా చీల్చి ఇజ్రాయెల్ను సృష్టించటమే బ్రిటిష్, అమెరికాల సామ్రాజ్యవాదపు దీర్ఘకాలిక వ్యూహం. ఆ మొత్తం ప్రాంతంలో గల అపారమైన చమురు నిల్వలపై పూర్తి నియంత్రణ తమకు ఎంత అవసరమో, భౌగోళికంగా కీలక ప్రాంతమైన ఆ దేశాలపై పట్టు కూడా అంత తప్పనిసరి. అందువల్లనే ప్రపంచమంతా ఆమోదించిన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్ ద్వారా నేటికీ అడ్డుకుంటున్నారు. గాజాను నిర్ధూమధామం చేసి, వెస్ట్బ్యాంక్ను ఆక్రమించి, గ్రేటర్ ఇజ్రాయెల్ను సృష్టించే పథకం ప్రస్తుతం అమెరికన్ శిబిరపు మద్దతుతో అమలవుతున్నది.
ఇందుకు ప్రస్తుత ఇరాన్ యుద్ధానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆ ప్రాంతంలోని అరబ్ దేశాలు ఏదో ఒక రూపంలో అమెరికాకు, ఇజ్రాయెల్కు దాసోహమనగా, ధిక్కరించి నిలిచిన ఏకైక శక్తి ఇరాన్. దానిని అడ్డుతొలగించుకుంటే తప్ప వారి పథకం నెరవేరదు. అందుకు చతురోపాయాలను ప్రయోగించటం కళ్లఎదురుగా కనిపిస్తున్న విషయం. ఇపుడు అమెరికా రంగప్రవేశం చేసినట్లయితే ఇరాన్ నిలవగలగటం అంత తేలిక కాకపోవచ్చు. గతంలో అమెరికా అనేక యుద్ధాలు ఓడినా భవిష్యత్తు ఏమిటన్నది అట్లుంచితే, ఇరాన్ ధిక్కారానికి మాత్రం జేజేలు పలకాలి.
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- (రచయిత సిీనియర్ సంపాదకులు)