Thursday, May 2, 2024

రైతులకు 3గంటల విద్యుత్ సరిపోతుందనడం సిగ్గుచేటు

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుంది అనడంపై మండిపడ్డారు. శుక్రవారం భూపాలపల్లి ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్‌ఏ గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 2004 నుండి 2009 వరకు 7గంటల విడతల వారీగా కరెంట్ ఇచ్చే వారని అన్నారు. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 24గంటల నాణ్యమైన విద్యుత్ రైతులకు అందుతుందని అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

ప్రజాహితం కోసం నిరంతరం బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే చౌకబారి ఆరోపణలు చేస్తున్నారన్నారు చంద్రబాబు రిమోట్ కంట్రోల్‌లో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషా చాలా అధ్వాన్నంగా ఉందని, అలాంటి వారిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ సింగిల్‌గా 109 సీట్లు ఒకేసారి ప్రకటించాడని, నువ్వు ఒకేసారి సీట్లు ప్రకటించగలవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణలో ఆసరా పెన్షన్‌ను రూ.4వేలు ఇస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాన్స్‌ఫారం లైన, వైర్లనైనా రేవంత్‌రెడ్డి పట్టుకోవచ్చని తెలిపారు. సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని గుర్తు చేశారు.

ఇప్పటికైనా అవగాహన లేకుండా మాట్లాడిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కుతున్న బొత్స సత్యనారాయణ మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోండని సూచించారు. కేంద్ర సహకారంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయలేదని ఎద్దేవ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలో పూర్తి చేశామని గుర్తు చేశారు. బొత్స సత్యనారాయణ అసలు మీ రాష్ట్ర రాజధాని ఎక్కడ, మీ రోడ్లు ఎలా ఉన్నాయి, మీ రాష్ట్రాన్ని నువ్వు ఒక్కసారి చూసుకో తర్వాత మా రాష్ట్రం గురించి మాట్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News