Saturday, April 27, 2024

మహిళలు ఆర్థికంగా బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: “యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అని నమ్మే నాయకుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. మహిళల ను కడుపు లో పెట్టుకుంటున్న కెసిఆర్ ను మహిళలు మనసు లో పెట్టుకుని అవసరమైన సందర్భంలో అండగా నిలవాలని ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి వేలాదిగా తరలివచ్చిన మహిళా సోదరీ మణులకు పిలుపునిచ్చారు.

అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య మహిళ పోస్టర్స్ ను మంత్రి విడుదల చేశారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని వారికి కావాల్సింది ప్రోత్సాహం అని అన్నారు. అందుకే అన్ని రంగాల్లో మహిళలకు కెసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రభుత్వ , ప్రైవేట్, రాజకీయ రంగాల్లో రాణిస్తున్న మహిళా మణులను సత్కరించారు. మహిళా దినోత్సవం కానుకగా జిల్లా లో ఉన్న 14201 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ క్రింద 750 కోట్ల చెక్ ను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఆడబిడ్డలకు అండగా సిఎం కెసిఆర్ ఉన్నారని ప్రశంసించారు.

మహిళా హక్కులు, రక్షణ విషయంలో భారత దేశానికే తెలంగాణ రాష్టం నమూనాగా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మితో ఆర్ధిక భరోసాతో పాటు బాల్య వివాహాలకు చెక్ పెట్టిన మహిళా రక్షకుడు కెసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ నిర్ణయంతో వచ్చిన షీ టీమ్స్ తో అద్బుతం ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. ప్రతీ పథకానికి మహిళా పేరు నామకరణం చేయడమే మహిళల పట్ల కెసిఆర్ కు ఉన్న ఆధరాభిమానాలకు నిదర్శనమన్నారు.

మహిళలు ఆర్థికంగా బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని నమ్మే నాయకుడు కెసిఆర్ అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతుందని కొనియాడారు. ఆడపిల్లలు తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు జగదీష్ రెడ్డి వెల్లడించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని జగదీష్ రెడ్డి స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News