టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ క్రీడా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో దినేశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్కు లభించిన అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడన్నాడు. అతన్ని కోహినూర్ వజ్రంతో పోల్చాడు. బుమ్రా..కోహినూర్లా విలువైన ఆటగాడని ప్రశంసలతో ముంచెత్తాడు. ఫార్మాట్ ఏదైనా తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో బుమ్రాకు ఎవరూ సాటిరారన్నాడు. అతనిలాంటి బౌలర్ దొరకడం టీమిండియా అదృష్టమన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులోఐదు వికెట్లు తీసి తానెంటో మరోసారి నిరూపించాడన్నాడు.
ఇంగ్లండ్ సిరీస్లో బుమ్రా ఇలాంటి ఫీట్లను మరిన్ని నమోదు చేయడం ఖాయమన్నాడు. ప్రతికూల పిచ్పై కూడా అసాధారణ బౌలింగ్తో ఐదు వికెట్లను పడగొట్టడం చాలా గొప్ప విషయమన్నాడు. టెస్టు క్రికెట్లో 200కు పైగా వికెట్లు తీసిన వారిలో బుమ్రానే అత్యుత్తమ యావరేజ్ను కలిగివున్నాడని, దీన్ని బట్టి అతని విలువ ఏంటో ఊహించుకోవచ్చన్నాడు. ఇదిలావుంటే తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్తో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే బౌలంగ్ చేయించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. అతనితో మరిన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేయించి ఉండాల్సిందని, దీంతో అతని ఆత్మవిశ్వాసం పెరిగేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో శతకాలతో చెలరేగిన యశస్వి, శుభ్మన్, రిషబ్లను కార్తీక్ పొగడ్తలతో ముంచెత్తాడు.