హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్ఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్(సిఎఫ్టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్) పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 నుంచి 11 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండటంతో పరీక్షలు నిర్వహించే రోజులను తగ్గించి 9వ తేదీ వరకే పరీక్షలను పూర్తి చేస్తామని ఎన్టిఎ తెలిపింది. దేశవ్యాప్తంగా రోజూ రెండు షిఫ్ట్లుగా నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యేందుకు 10.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
అందులో బిఇ,బి.టెక్ కోసం 9.34 లక్షల మంది, బి.ఆర్క్, బి.ప్లానింగ్ కోసం 1.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖా స్తుల్లో 2.90 లక్షల మంది బాలికలున్నారు. గతేడాది కంటే బాలికల సంఖ్య ఈసారి పెరిగింది. గతేడాది నిర్వహించిన జెఇఇ మెయిన్కు 2,74,753 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అదనంగా 15,247 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఇడబ్ల్యూఎస్ కోటా కింద 81,413 మంది దరఖాస్తు చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 9.34 లక్షల మంది విద్యార్థులు హాజరువుతుండగా, తెలంగాణ నుంచి సుమారు 75 వేల మంది మంది పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. మొదటి షిఫ్టు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు.