తుంగభద్రపై తాము నిర్మించదలచుకున్న ఆనకట్టపై కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన
బళ్లారి : తుంగభద్ర నదిపై సమాంతర ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కర్నాటక చర్చలు జరుపుతుంది. ఈ విషయాన్ని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆదివారం విలేకరులకు తెలిపారు. నదిలో ఇసుకమేటల తొలిగింపునకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవసరం అని కర్నాటక భావిస్తోంది. సంబంధిత అంశంపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ డ్యాం నిర్మాణానికి తెలంగాణ, ఎపిలతో మాట్లాడాల్సి ఉందని, సవ్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు చర్చలకు వెళ్లుతామని బసవరాజు వివరించారు. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించి సర్వే జరుగుతున్నట్లు , ఇంతకు ముందటి సిఎం బిఎస్ యడ్యూరప్ప ప్రాజెక్టు నిర్మాణానికి రూ 23 కోట్లు విడుదల చేసినట్లు తనకు తెలిసిందని తెలిపారు.
తుంగభద్రలో ఇసుకమేటల సమస్య జటిలం అవుతోందని, వీటిని తొలిగించాల్సి ఉందన్నారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించినట్లు చెప్పారు. ఇసుకమేటల సమస్య పరిష్కారానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం అవసరం అని, బిజెపి ప్రభుత్వ హయాంలోనే సంబంధిత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక అందుతున్నందున ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అన్కిన అంశాలను చర్చించుకోవల్సి ఉంటుందని చెప్పారు. ఇది నదీజలాల అంతరాష్ట్ర అంశం అయినందున చర్చలలో అన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.