Tuesday, April 30, 2024

బోర్లు వేసి అప్పులపాలు.. మహిళా రైతు కొడుకు పెళ్లికి కెసిఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. జనగామ, సూర్యపేట జిల్లాల్లో ఎండిన పంట పొలాలను ఆదివారం కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు.

పర్యటనలో భాగంగా మొదట ఆయన జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం ధరావత్‌ తండాలో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆంగోతు సత్తెమ్మ అనే మహిళా రైతు తన బాధను కెసిఆర్ తో చెప్పుకుంది. నీళ్లు లేక పంట ఎండిపోతుండడంతో నాలుగు బోర్లు వేశామని.. అయినా చుక్క నీరు రాలేదని.. దాంతో తమ నాలుగు ఎకరాల పంట ఎండిపోయిందని వాపోయింది.

బోర్లు వేసేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు అయ్యిందని కన్నీరు పెట్టుకుంది. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని.. పంటలు ఎండిపోవడం, అప్పులు తెచ్చి బోర్లు వేయడంతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సత్తెమ్మ కెసిఆర్ ఎదుట తన ఆవేదన చెప్పుకుంది. వెంటనే స్పందించిన కెసిఆర్..సత్తెమ్మ కొడుకు పెళ్లి ఖర్చు నిమిత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రైతులు ఎవరూ బాధ పడొద్దని.. ధైర్యం చెప్పారు కెసిఆర్. పొరాడి మన నీళ్లు మనం తెచ్చుకుందామని బాధిత రైతులకు ఈ సందర్భంగా కెసిఆర్ భరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News