Tuesday, May 14, 2024

యాదాద్రి కలను నిజం చేసిన నాయకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR is leader who made Yadadri's dream come true

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) తాను అనుకున్నది సాధిస్తారు. ఉహలకు రెక్కలు తొడిగి అవి నిజంగానే చివురించేలా చేస్తారనే నానుడి మరోమారు రూఢీ అయింది. ఆయన తమ మరో కలల ప్రాజెక్టును నిజం చేసుకుని ఆవిష్కరించారు. యాదగిరి గుట్టగా జనం నోళ్లలో మెదిలే కదిలే యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయ చారిత్రక విస్తరణ కల సాకారం అయింది. ఇది ఓ ఆలయపట్టణపు బ్రహ్మండ స్థాయి పునరుద్ధరణ అంతకు మించిన పునరుజ్జీవంగా చరిత్రకు ఎక్కింది. ఈ సాకార సత్కార్యక్రమానికి అయిన అంచనా వ్యయం రూ 850 కోట్లు. ఈ బృహత్తర కలల ప్రాజెక్టు ఎనిమిది సంవత్సరాల నవప్రాయపు తెలంగాణ రాష్ట్రానికి బహుముఖ ఖ్యాతిని తీర్చిదిద్దింది. ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక బలోపేత దిశలో తెలంగాణకు మరింత వన్నెచిన్నెలు తెచ్చిపెట్టింది. యాదాద్రి కెసిఆర్ తెలంగాణ పట్ల కన్న మహత్తర కలల సౌధాలలో నాలుగోది. ఇంతకు ముందు మిషన్ భగీరథ ( ఇంటింటికి మంచినీరు కల్పించడం) మిషన్ కాకతీయ ( చెరువులు కుంటల పునరుద్ధరణం), కాళేశ్వరం ఎడమ నీటిపారుదల ప్రాజెక్టు తరువాత ఈ యాదాద్రి వైభవ ఘట్టాన్ని ఆయన కలగా ఊహగా ఎంచుకుని నిజం చేశారు.

శతాబ్దాల చరిత గల యాదాద్రి దేవాలయానికి ఇప్పుడు జరిగిన విస్తరణ, పునరుద్ధరణ ఘట్టం దీనికి కెసిఆర్ ఆవిష్కరణం ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఆరు సంవత్సరాల క్రితం ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు ఆరంభం అయ్యాయి. ఈ పనిలో నిమగ్నం అయ్యి అంకితభావంతో పనిచేసిన వారందరూ ఇప్పుడు ఈ జనాంకిత నూతన యాదాద్రి మరో వేయి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉంటుందని తెలిపారు. ఇక్కడ 900 మంది శిల్పులు, వేలాది మంది కూలీలు రాత్రింబవళ్లు శ్రమించి ఈ అత్యద్భుత ఆలయ నిర్మాణానికి తాము సైతంగా నిలిచారు. స్థానికంగానే కాదు తెలంగాణ అంతటా యాదగిరి గుట్టగా పిలిచే ఈ ప్రాంతం దేశ విదేశాల నలుమూలాల నుంచి భక్తులు జనులు తండోపతండాలుగా తన వద్దకు రప్పించుకుని తీరుతుంది.

ఈ పునర్నిర్నిత ఆలయ ప్రారంభ కార్యక్రమమైన మహా సంప్రోక్షణానికి అత్యంత ప్రముఖులు (వివిఐపిలు) అంటే ప్రధాని లేదా రాష్ట్రపతి వంటి వారిని ఎవరిని ఆహ్వానించకుండా ఉండటంలో కెసిఆర్ సముచితంగానే వ్యవహరించారు. ఎందుకుంటే ఈ పునర్ నిర్మిత ఆలయ దార్శనికులు, ప్రధాన కార్యాచరణకర్త, నిర్వాహకులు అంతా కూడా కెసిఆర్ అయి ఉన్నారు. ఈ దిశలో ఆయన ఈ తీర్చిదిద్దిన ఆలయానికి ప్రధాన ఏకైక ప్రధాన అతిధి అత్యంతం ఆద్యంతం అభిలషియమే. ఈ యాదాద్రి గుట్ట దేవాలయ భారీ స్థాయి విస్తరణకు దిగాలనే కెసిఆర్ ఆలోచన వెనక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత తిరుపతి పుణ్యక్షేత్రం ఆంధ్రకు చెందింది. దీనితో ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తిరుపతిలో వెంకన్న దర్శనానికి వెళ్లుతుంటారు. అయితే దర్శనానికి తెలంగాణ మంత్రులు లేదా అధికారులు ఇచ్చే దర్శన సిఫార్సుల లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు సిబ్బంది పెద్దగా పట్టించుకోరు. ఈ దశలో తెలంగాణకు మరో అతి పెద్ద దేవాలయం అవసరం. ప్రతిరోజూ భక్తులు తరలివచ్చే దైవసన్నిధి కావాలి.

2014 నాటి యాదగిరి గుట్ట భక్తుల రద్దీని తట్టుకునే రీతిలో లేదు. ఈ కొరత తీర్చే రీతిలో ఇప్పుడు 2022 నాటి యాదాద్రి వెలిసింది. ఇక యాదాద్రి పునర్నిర్మాణానికి రెండో కారణం యాదగిరి గుట్టకు తెలంగాణ ప్రజలకు ఉన్న గుండె చప్పుడు ముడి బంధం. కొంగుముడి వైనం. తెలంగాణలో ప్రతి పల్లెలో తరాల నుంచి నరసింహస్వామి పేరు పెట్టుకుంటారు. నర్సయ్యలు, యాదగిరిలు ఇక్కడ అత్యధికం. ఈ భక్తుల రాకకు తగు విధంగా ఇక్కడి కొవెల నెలకొనాలి. ఇక కెసిఆర్ అనుకున్న మూడో చివరి కారణం యాదాద్రి నెలకొన్న ప్రాంతం. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉంది. దీనిని తగు విధంగా ఆధ్యాత్మిక, శిల్పకళా వైభవాలతో పాటు అత్యంత కీలక సౌకర్యాలతో తీర్చిదిద్దితే భవిష్యత్తులో ఇది హైదరాబాద్ విస్తారిత ప్రాంతంలో ఒకటిగా నిలుస్తుంది. హైదరాబాద్ శివార్ల సిగలో వెలిసే మెరిసే ఆణిముత్యం అవుతుంది. వెనువెంటనే ఇది సాధ్యం కాకపోవచ్చు, పదేళ్లు పట్టొచ్చు, లేదా అంతకు మించి కాలం పట్టవచ్చు. అన్ని దార్లూ హైదరాబాద్ నుంచి యాదాద్రికి దారితీస్తాయి. యాదాద్రికి భాగ్యనగరానికి మధ్యలోని భోనగిరిపట్టణం త్వరలోనే మెట్రోపాలిస్ నగరం అవుతుంది.

అయితే యాదాద్రికి ఇప్పటి ఘనమైన రూపం అవలీలగా రాలేదు. కెసిఆర్ పలుసార్లు ఆలయానికి వచ్చారు. ఎండా చలి వానలను పట్టించుకోకుండా అక్కడ గంటల తరబడి గడిపారు. నిర్మాణ పనుల ప్రతిఘట్టాన్ని తాను దగ్గరుండి పర్యవేక్షించారు. శిల్పుల పనితీరును పరిశీలించారు. దేవాలయ స్థలం ఆవరణలో తిరిగారు. ప్రధాన స్తపతులు, శిల్పులకు , అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు దఫాలు సముచిత ఆదేశాలు వెలువరించారు. తొలుత పలు దశల్లో పనులలో మందకొడితనం పట్ల ఆయన కొంత విసుగుచెందారనేది వాస్తవం. తరువాతి క్రమంలో పుంజకున్న పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ పనుల తీరు పట్ల సంతోషం అసంతృప్తి వ్యక్తం చేసిన పలు రకాల సందర్భాలు ఉన్నాయి. యాదాద్రికి పునర్ వైభవం పట్ల ఆయన తపన ఫలితం ఇది. ఏ మంత్రి లేదా ఏ ఉన్నతాధికారి లేదా సంబంధిత అధికారి కానీ ఈ దిశలో ఆయన భావోద్వేగాలను తపనను అర్థం చేసుకోలేకపొయ్యారని నేను భావిస్తున్నాను. ఆయనకు ఎందుకింత ఆకాంక్ష ఎందుకింత పట్టుదల, ఎందుకింత మొండితనం అనుకున్నారు. కానీ ఎందుకనేది వారికి తెలిసిరాలేదు. ఆయన పనుల తీరు పట్ల ఎవరిపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. యాదాద్రి బ్రహ్మండ రీతి ప్రతి ఘట్టంలో ఆయన జోక్యం చేసుకున్నారు.

బిజెపి తరహా హిందూత్వ కాదు

కెసిఆర్ స్వతహసిద్ధంగానే దైవభక్తుడు. దేవుడిని విశ్వసిస్తారు. దీనితోనే ఏమో యాదాద్రి తీర్చిదిద్దే ఘట్టం ఆయనకు మరింత చేరువ అయింది. గుడి గంటలు ఆయన గుండెచప్పుళ్లు అయి నడిపించినట్లు ఉన్నాయి. తాను కరడుగట్టిన హిందూవును అని కెసిఆర్ పలుసార్లు ప్రకటించుకున్నారు. ఆయన కఠోర దీక్షతోనే హిందూ సాంప్రదాయలను పాటిస్తారు. అయితే ఆయన ఎక్కడా ముస్లింలు లేదా ఇతర మతస్థులను వేరు లేదా విద్వేష భావనలతో చూడలేదు. సమాదరణనే పాటించారు. కెసిఆర్ తమ మేధోసంతానం వంటి ప్రపంచపు అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అని నామకరణం చేశారు. ఇది గోదావరి ఒడ్డున ఉండే అతి ప్రఖ్యాత శైవక్షేత్రం అయిన కాళేశ్వరం. కాళేశ్వరం పేరునే నీటి పారుదల ప్రాజెక్టుకు పెట్టారు. ఇక ఆయన మేధోఫలంలో మరోటిగా నిలిచిన యాదాద్రి వైష్ణవ పుణ్యక్షేత్రం.

ఈ విధంగా కెసిఆర్ శివ వైష్ణవ భేదభావాలకు అతీతంగా నిలిచారు. కెసిఆర్‌ను కొందరు 16వ శతాబ్ధపు శ్రీకృష్ణదేవరాయలుతో పోలుస్తారు, తిరుమల కొండలపై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ పునరుద్ధరణకు నడుం కట్టిన వ్యక్తి రాయలు. కొందరు ఆలయ నిర్మాణానికి ఇంతటి ప్రజాధనం వెచ్చిస్తారా? అని కొందరు విమర్శిస్తూ ఉండొచ్చు, వెటకారాలు చేయవచ్చు అయితేకెసిఆర్‌కు తాను ప్రజలు కోరుకుంటున్నదే చేస్తున్నానని తెలిసిన వారు. ఆధ్యాత్మికతను అభివృద్ధి లేదా ఆర్థిక ప్రగతి నుంచి విడదీసి చూడటం కుదరదు. ఇవి అవిభాజ్య విషయాలు . అన్నింటికి మించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండటం, వారి కలలను సాకారం చేయడం, ఈ దిశలో ముందుకు సాగుతోన్న కెసిఆర్ యాదాద్రి పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు. మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శుభం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News