టెహరాన్: సులేమాని మరణం తమలోని విప్లవానికి పునరుజ్జీవం కల్పించిందని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా ఖమేనీ ప్రకటించారు. ఇరాక్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడుల నేపథ్యంలో ఖమేనీ స్పందిస్తూ తమ ప్రతిఘటన తత్వం ఇంకా సజీవంగా ఉందని ప్రపంచానికి తెలిసిందని అన్నారు. గత రాత్ర అమెరికాకు చెంపదెబ్బ కొట్టామని, తమ ప్రాంతంలో అక్రమంగా తిష్టవేసిన అమెరికా స్థావరాలు అంతం కావాలని ఖమేనీ ప్రకటించారు. తమ ప్రాంతంలో అమెరికా విధ్వంసం సృష్టించిందని, చర్చల గురించి మాట్లాడుతూనే జోక్యం చేసుకోవడం అమెరికా నైజమని ఆయన అన్నారు. రాజకీయంగా, సైనికపరంగా అమెరికాను ఎదుర్కోగల సత్తా ఇరాన్ ప్రజలకు ఉందని ఖమేనీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో అమెరికా పన్నిన అనేక చట్టవ్యతిరేక పన్నాగాలను ఖాసీం సులేమానీ సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆయన కీర్తించారు. ఖాసీం సులేమానీ పోరాట యోధుడని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడిన పాలస్తీనీయులకు ఆయన ఎంతో సహాయపడ్డాడని ఖమేనీ అన్నారు.
ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహానీ తాజాగా అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. జనరల్ ఖాసీం సులేమానీ ‘చేతిని’ అమెరికా నరికి ఉండవచ్చు కాని ఇందుకు బదులుగా ఇరాన్ తమ ప్రాంతంలో అమెరికా ‘కాలిని’ నరికి వేసిందని ఆయన ప్రకటించారు. సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో రౌహానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Khamenei says Iran slapped in face of US