Monday, May 6, 2024

బిజెపి రథ సారధిగా కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురందేశ్వరి
జార్ఖండ్‌కు బాబులాల్ మరాండి, పంజాబ్‌కు సునీల్ జక్కడ్, రాజస్థాన్‌కు గజేంద్రసింగ్ షెకావత్
రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్
జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : భారతీయ జనత పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. బిజెపి తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో వివిధ రాష్ట్రాల్లో మార్పులు జరిగాయి. తెలంగాణలో బండి సంజయ్, ఎపిలో సోము వీర్రాజును పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన బిజెపి అధిష్టానం.. వారి స్థానంలో కిషన్‌రెడ్డి, పురందేశ్వరిలను నియమించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎపి బిజెపి అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌గా బాధ్యతలు అప్పగించారు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. వీరితో పాటు ఝార్ఖండ్ బిజెపి అధ్యక్షుడిగా మాజీ సిఎం బాబూలాల్ మరాండీ, పంజాబ్ బిజెపి అధ్యక్షుడిగా సునీల్ జాక్కడ్, రాజస్థాన్‌లో గజేంద్రసింగ్ షెకావత్‌ను నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
కిషన్‌రెడ్డి ప్రస్థానం…
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో స్వామిరెడ్డి. ఆండాళమ్మ దంపతులకు 1960లో జన్మించిన కిషన్ రెడ్డి డిప్లొమా వరకు చదువుకున్నారు. 1977లో జనతాపార్టీలో ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ‘కిషన్ రెడ్డి 1980లో బిజెపి స్థాపించిన తర్వాత పూర్తి స్థాయిగా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కిషన్ రెడ్డి. 2010 నుంచి 2014 వరకు బిజెపి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా. సికింద్రాబాద్ నుంచి ఎంపిగా సేవలందించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవి చూసిన కిషన్‌రెడ్డి. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో పనిచేస్తున్నారు.2016- నుంచి -18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. బిజెపి అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు.
పురందేశ్వరి ఇలా…
దగ్గుబాటి పురందేశ్వరి 1959 ఏప్రిల్ 22న జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి.. 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. యూపిఎ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఎపి విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి బిజెపిలో చేరారు. పార్టీ మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బిజెపి ఒడిశా రాష్ట్ర బాధ్యురాలిగా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News