Friday, June 20, 2025

కోహ్లీ, రోహిత్ లేని డ్రెస్సింగ్ రూమ్‌ వింతగా అనిపిస్తోంది: కెఎల్ రాహుల్

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ తొలి పర్యటనకు ఇంగ్లండ్ లో అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా రేపు(జూన్ 20వ తేదీ) లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్ జట్టుతో మొదటి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కెఎల్ రాహుల్.. కోహ్లీ, రోహిత్ లను మిస్ అవుతున్నట్లు తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళితే వింతగా అనిపిస్తోందని రాహుల్ భావోద్వేగానికి లోనైట్లు తెలుస్తోంది.

“గత దశాబ్ద కాలంగా విరాట్, రోహిత్ భారత క్రికెట్‌కు మూలస్థంభాలుగా ఉన్నారు. వారు లేకపోవడం చాలా పెద్ద లోటు. ఇప్పటివరకు నా మొత్తం కెరీర్‌లో విరాట్ లేదా రోహిత్ లేని జట్టులోకి నేను ఎప్పుడూ అడుగుపెట్టలేదు. వారిద్దరూ లేకుండా నేను ఒక్క టెస్టు కూడా ఆడలేదు. నేను ఆడిన 50కి పైగా టెస్ట్ మ్యాచ్‌లలో విరాట్ లేదా రోహిత్ లేదా ఇద్దరూ ఉన్నారు. కోహ్లీ, రోహిత్ లేని డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టడం కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ, వారి నిర్ణయాన్ని గౌరవించాలి. వారు దేశం కోసం పూర్తిగా ప్రతిదీ ఇచ్చారు. ఇద్దరూ భారత క్రికెట్‌లో దిగ్గజాలుగా మిగిలిపోతారు. మిగిలిన వారు ముందుకు సాగాల్సిన సమయం ఇది. నేను ఐపిఎల్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కోసం నా సన్నాహాలను ప్రారంభించాను. ఈ సిరీస్ కోసం సిద్ధం కావడానికి నేను నా కోచ్‌తో కూడా మాట్లాడాను. ఇంగ్లాండ్‌కు రావడం ఎల్లప్పుడూ ఒక సవాలు, ఎందుకంటే అది చాలా మంచి జట్టు, ముఖ్యంగా వారు స్వదేశంలో ఆడినప్పుడు. మేము యువ జట్టు కాబట్టి.. ఇది మాకు సవాలుగా ఉంటుంది” అని రాహుల్ పేర్కొన్నాడు.

కాగా, 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఎంఎస్ ధోని నాయకత్వంలో రాహుల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌లో రాహుల్‌కు ఇది మూడవ టెస్ట్ పర్యటన. ఆతిథ్య జట్టుపై తొమ్మిది టెస్ట్‌లలో రాహుల్ 34.11 సగటుతో 614 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. 2018లో ది ఓవల్‌లో జరిగిన మ్యాచ్ లో రాహుల్ తొలి సెంచరీ సాధించాడు. కానీ దురదృష్టవశాత్తు భారత్ ఆ మ్యాచ్‌లో 130 పరుగుల తేడాతో ఓడిపోయి, చివరికి 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఇక, 2011 తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో కోహ్లీ లేదా రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని మొదటి టెస్టు సిరీస్ ఇదే అవుతుంది. కోహ్లీ, రోహిత్ లేకపోవడంతో జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో ఒకరిగా.. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ సిరీస్ కోసం రాహుల్ ముందుగానే ఇక్కడికి వచ్చేశాడు. ఇండియా ఎ తరఫున అనాధికార టెస్టులో కూడా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News