Thursday, May 2, 2024

ఈ సంక్షోభాన్ని సానుకూలంగా మలుచుకుందాం

- Advertisement -
- Advertisement -

KTR

 

ఐటి అనుబంధ సంస్థలపై మార్గదర్శనం జరగాలి
పారిశ్రామికవేత్తలు, మేధావులతో జాతీయస్థాయిలో వ్యూహ బృందాలను ఏర్పాటు చేయండి
తెలంగాణకు రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు కేటాయించండి
వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు పలు విలువైన సూచనలు చేసిన మంత్రి కెటిఆర్
ఐటి అనుబంధ రంగాలకు స్ట్రాటజీ గ్రూప్ ఏర్పాటు చేస్తాం :కేంద్రమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు మరో రెండు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కేటాయింటాలని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు క్లస్టర్లు నిండిపోయిన నేపథ్యంలో కేం ద్రం అదనంగా ఇఎంసిలకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన కీలక సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాల ఐటి శాఖ మంత్రుల తో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్…19 వ్యాధి సంక్షోభం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు. కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ముఖ్యంగా ఐటి సంబంధిత కార్యక్రమాల పైన ఆయా రాష్ట్రాల మంత్రులు పలు సలహాలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలోనూ అనేక అవకాశాలను పరిశ్రమలు అందుకునే పరిస్ధితులు ఉన్నాయని, ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహాయకారిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ సూచించారు.

ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తామని బహిరంగంగా చెబుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి తరలి పోయే పరిశ్రమలు ముఖ్యంగా ఐటి సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలను భారతదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా పెద్ద ఎత్తున దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరోనా కట్టడి, లాక్ డౌన్ అనంతరం వ్యాపార వాణిజ్యాల నిర్వహాణపైన వివిధ దేశాలు ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మేధావులతో స్ట్రాటజీ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. భారత దేశంలోని ఐటి సంబంధిత పరిశ్రమకు కూడా ఇక్కడి ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో, ఆయా రంగాల నిపుణులతో స్ట్రాటజీ గ్రూపును ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

తద్వారా వైరస్ అనంతర పరిస్థితుల్లో వ్యాపార వాణిజ్యం కొనసాగే ఈ విషయంలో ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం అనేక కంపెనీలు పెద్ద ఎత్తున వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని, సమీప భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ ఆధారిత అటాక్‌లను తట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింత అవకాశాలు ఉన్నాయని ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కెటిఆర్ సూచించారు.
ప్రస్తుతం సంక్షోభం సందర్భంగా పెద్ద ఎత్తున ఇంటర్నెట్ ని ప్రజలు ఉపయోగిస్తున్న నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల బలోపేతం దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించాలన్నారు.

భారత్ నెట్ ప్రాజెక్ట్ కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని సూచించారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫార్మా వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ రంగాల్లో ఐటి ఆధారిత అవకాశాలు లేదా ఆయా రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక నూతన అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదన్నారు. వీటిని అందుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ కామర్స్ ద్వారా ప్రాథమిక అవసరాలైన వస్తువుల నుంచి మొదలుకొని అన్ని రకాల సదుపాయాలు ఈ కామర్స్ రంగంలోకి వచ్చే అవకాశం ఉన్నదని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ.కామర్స్ రంగానికి కూడా పెద్ద ఎత్తున సహాయం అందించాలని ఆయన కోరారు. ఐటి,ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లోని ఎంఎస్‌ఎంఈ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో వాటికి జిఎస్‌టి పన్నులు, ఆదాయపు పన్ను వంటి వాటి విషయంలో పలు మినహాయింపులను ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ప్రస్తుతం అమెరికా యూరప్ వంటి దేశాల్లో కరోనా వ్యాధి వలన ఆయా ఆర్థిక వ్యవస్థల పైన చూపేటువంటి ప్రభావం వలన భారతదేశ ఐటి, అనుబంధ కంపెనీలకు ఏదైనా సమస్య ఎదురైతే వాటిని ఆదుకునేలా లేదా? ఆయా రంగాల్లోని మానవ వనరులను ఇతర రంగాల్లో కి తరలించేలా, ఇతర రంగాలపైన ఇప్పటి నుంచే స్ధూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఐటి శాఖ మంత్రులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

సమావేశానంతరం మాట్లాడిన కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామన్నారు. కెటిఆర్ సూచించిన మేరకు ఐటి అనుబంధ రంగాలకు ఒక స్ట్రాటజీ గ్రూప్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో పాటు ఇంటర్నెట్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ నెట్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య సేతు సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రులకు ఆయన సూచించారు.

 

KTR made valuable suggestions to Ravi Shankar Prasad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News